'భోళా శంకర్' పై కేసు.. రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారన్న డిస్ట్రిబ్యూటర్

భోళా శంకర్ పై కేసు.. రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారన్న డిస్ట్రిబ్యూటర్
ఏకె ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని మోసగించారన్న వైజాగ్ డిస్ట్రిబ్యూటర్

తెలుగు సినీ పరిశ్రమంలో పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఏకె ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని మోసగించారని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) ఆరోపించారు. అందుకే 'భోళా శంకర్' సినిమాపై కేసు వేశామని స్పష్టం చేశారు.

ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) ఆరోపించారు. ఆ మేరకు తనకు జరిగిన అన్యాయంపై ఆయన ఒక ప్రెస్ నోట్ ను కూడా విడుదల చేశారు. "ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ నన్ను మోసం చేయడంతో వారి నిజ స్వరూపం బట్టబయలు అయింది. వారు చేసిన అన్యాయం ఏమిటో ప్రతీ ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏప్రిల్ ఆఖరులో విడుదలైన "ఏజెంట్" సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు నా గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చి 30 కోట్ల రూపాయలు తీసుకుని మరీ వారు నన్ను పచ్చిగా మోసగించారు. బ్యాంకు అకౌంట్ రూపంలో నా సహచర వ్యాపార మిత్రుల సహకారంతో 30 కోట్ల రూపాయల వైట్ మనీని "ఏజెంట్" సినిమా మూడు రాష్ట్రాల హక్కుల కోసం నేను చెల్లించినట్లు పక్కాగా ఆధారాలు ఉన్నప్పటికీ వారు ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను విడుదల సమయంలో కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే అందజేసి, అగ్రిమెంట్ కు తూట్లు పొడిచార"ని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

"ఆ తర్వాత మే 1వ తేదీన హైదరాబాద్ లోని వారి ఆఫీస్ కు వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్ ను కలవడం జరిగింది. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు ఎదురయ్యాయి. సినిమా డిజాస్టర్ ప్లాప్ అయ్యిందని చెప్పి, మరుసటి రోజు అనగా మే 2వ తేదీన మళ్ళీ ఆఫీసుకు వస్తే, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని నాకు చెప్పారు. ఆ మేరకు నాకు అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో డబ్బులు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత వారు చేసిన సామజవరగమన చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను విశాఖపట్నం వరకు ఇచ్చారు. ఆ చిత్రం ద్వారా కేవలం చాలా కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యింది. ,ఈ నేపథ్యంలో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామని, ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తానని నాకు ఒప్పంద పత్రం చేశారు. అయితే వారి నెక్స్ట్ సినిమా భోళా శంకర్ అయ్యింది. అయితే కొద్ది రోజులుగా వారు నాకు సమాధానం ఇవ్వడం మానేశారు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు కూడా ఈ విషయం చెప్పి, సంప్రదింపులు జరిపినప్పటికీ, ఫలితం లేకపోవడంతో నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగడం కోసం తప్పనిసరి పరిస్థితులలో కోర్టుకు వెళ్లడం జరిగింద"ని బత్తుల సత్యనారాయణ చెప్పుకువచ్చారు.

"విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ గా సినీ పరిశ్రమతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. రంగస్థలం, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి అనేక సినిమాలను నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను అలాగే ఎ.కె. ఎంటర్ టైన్మెంట్స్ పైన వారు నిర్మించిన, అలాగే ఇతర బ్యానర్స్ పైన భాగస్వాములతో కలసి వారు తీసిన అనేక సినిమాలను నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను. గతంలో ఎప్పుడూ డబ్బు గురించిన సమస్యలు కానీ మోసాలు కానీ తలెత్తలేదు. అయితే ఇప్పుడు ఎ.కె. ఎంటర్ టైన్మెంట్స్ వారు నా దగ్గర 30 కోట్లు తీసుకుని, సరిగ్గా సమాధానం చెప్పకుండా, ఎగొట్టాలనే తలంపుతో ఆఖరికి నా మీద ఫోర్జరీ చేశాననే నింద కూడా వేశారు. వాస్తవానికి ఆ మధ్య యూరో స్ ఇంటర్నేషనల్ వారికి వీరు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో వీరిపై ఆ సంస్థ కేసులు కూడా పెట్టింది. అలాగే ఎంతోమందిని మోసం చేస్తూ, వీరు తమ గుడ్ విల్ ను పోగొట్టుకున్నారు.. ఇంకా ఎంతోమందికి వీరు బాకీలు ఉన్నారు. నా నీతి, నిజాయితీ ఏమిటో సినీ పరిశ్రమతో పాటు అందరికీ తెలుసు. అయితే తెలియని వారికోసమే తప్పనిసరి పరిస్థితులలో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నా"నని ఆయన అన్నారు.

తనకు న్యాయం జరగాలని ఆశిస్తూ అడ్వకేట్ కేశాపురం సుధాకర్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని సత్యనారాయణ చెప్పారు. మరోవైపు క్రిమినల్ కేసు కూడా వారిపై ఫైల్ చేయడం జరిగిందని, అలాగే ఫైనాన్సియర్స్ అందరిపైనా ఈడీకి ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. "నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు ఎంతో ఇష్టం. వారు నటించిన సినిమా అన్న ఉద్దేశ్యంతోనే నేను ఆచితూచి, ఇంతవరకు ఎక్కడా మీడియా కు ఎక్కకుండా ముందుకు సాగాను. అయితే నా మీద ఎప్పుడైతే ఫోర్జరీ నింద వేసి, ఆ వార్తలను గ్రూపులలో తిప్పిస్తూ, నన్ను అప్రదిష్టపాలు చేస్తున్నారు. అయినా నిజాయితీ, న్యాయం,గెలుస్తాయని నేను నమ్ముతున్నాను. బుధవారం సాయంత్రం కోర్టులో విషయం తేలిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మాట్లాడుతాం. వాస్తవాలను మీడియా ముందు ఉంచుతాం" అని డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story