Jagadeka Veerudu Athiloka Sundari: ఆ సినిమా కోసం చిరంజీవి, శ్రీదేవి పారితోషికం ఎంత తీసుకున్నారో తెలుసా?

Jagadeka Veerudu Athiloka Sundari: తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన క్లాసిక్స్లో మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి ' ఒకటి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలోసోషియో-ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఓ అందమైన లోకంలో విహరింపజేసింది. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి నిర్మాత అశ్వినీదత్. వైజయంతీ మూవీస్ బ్యానర్లో వచ్చిన అతిపెద్ద విజయవంతమైన చిత్రాలలో ఇది ఒకటి.
సుందరం మాస్టారు, ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన డ్యాన్స్ మూవ్మెంట్స్కి తోడు మాస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు ఈ చిత్రానికి హైలెట్గా నిలిచాయంటే అతిశయోక్తికాదు. 1990లో మే 9న విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది 9 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందించబడిన తెలుగు చిత్రంగా అప్పట్లో చెప్పుకున్నారు.
నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నటీనటుల పారితోషికం గురించి చెబుతూ "చిరంజీవికి దాదాపు రూ. 35 లక్షలు, శ్రీదేవికి రూ. 25 లక్షలు ఇచ్చాము". ఆ సమయంలో శ్రీదేవి క్రేజ్ పీక్స్లో ఉంది. స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునేది.
జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉన్నా అది ఇంకా ఆచరణలోకి రావట్లేదని అశ్విని దత్ అన్నారు. ఒకవేళ సీక్వెల్ వస్తే.. రామ్ చరణ్, జాహ్నవి కపూర్లను హీరోహీరోయిన్లుగా తీసుకుంటారా అని అడిగితే అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com