Sandalwood Smuggler 'Veerappan' : అప్పుడు గంధపు చెక్కల స్మగ్లర్ 'వీరప్పన్'.. ఇప్పుడు 'పుష్ప'లో అల్లు అర్జున్..

Sandalwood Smuggler 'Veerappan' : ఓ సాధారణ కూలీ నుంచి ఎర్ర చందనం స్మగ్లర్గా పుష్పరాజ్ ఎదిగిన తీరుని సుకుమార్ సినిమాగా చిత్రీకరించారు.. సరిగ్గా ఈ తరహా నేపథ్యం ఉన్న గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
మూడు రాష్ట్రాల అధికారులను గడగడలాడించిన వీరప్పన్ కుటుంబ నేపథ్యం చాలా సాదా సీదాగా ఉంటుంది. పశువులను మేపగా వచ్చే ఆదాయమే వారికి బ్రతుకుదెరువు. తన మామ సాల్వాయి గౌండర్ బాటలో పయనించి గంధపు చెక్కల స్మగ్లర్గా 17 ఏళ్ల వయసులోనే తన నేర జీవితాన్ని ప్రారంభించాడు వీరప్పన్. అడవిలోని మూగజీవాలైన ఏనుగులను చంపి వాటి దంతాలతో కూడా వ్యాపారం చేసేవాడు.
తన 25 ఏళ్ల నేర చరిత్రలో దాదాపు 3వేల ఏనుగులను చంపినట్లు రికార్డుల సారాంశం. తన చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ప్రతిఘటించిన వారిని చంపడానికి వీరప్పన్ ఏమాత్రం ఆలోచించేవాడు కాదు. అతడి చేతిలో బలైన వారిలో అధికంగా పోలీసు అధికారులు, అటవీ అధికారులు, సమాచారం అందించే కొరయర్స్ కూడా ఉన్నారు.
వీరప్పన్ ప్రజలను చంపడానికి ఇష్టపడే వాడు కాదు.. అయితే ఎవరైనా పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారని అనుమానం వస్తే చాలు ఇక వాళ్లు బ్రతుకు మీద ఆశలు వదులు కోవలసిందే.. రాజకీయ అస్థిరత కారణంగా, వీరప్పన్ ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి సులభంగా తప్పించుకోగలిగాడు. అడ్డొచ్చిన పోలీసులను చంపడం, వారి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం మామూలే. వీరప్పన్ను పట్టుకునేందుకు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశాయి.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న అడవులు వీరప్పన్కు కొట్టిన పిండి. అందుకే టాస్క్ఫోర్స్ కానీ, పోలీసులు కానీ తన స్థావరం తగ్గరకు వస్తున్నారంటే ఇన్ఫార్మర్ల ద్వారా ముందే ఆ విషయాన్ని పసిగట్టి జాగ్రత్తపడేవాడు.. చాలా నేర్పుగా, షార్ప్గా అక్కడి నుంచి తన మకాం మార్చేసేవాడు.. అందుకే వీరప్పన్ని పట్టుకోవడం టాస్క్ఫోర్స్కి చాలా కష్టమయ్యేది. పైగా అటవీ సమీప గ్రామాల ప్రజలు కూడా వీరప్పన్ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడానికి భయపడేవారు.
1986లో ఒకసారి వీరప్పన్ని పట్టుకున్నారు పోలీసులు.. కానీ అనూహ్యంగా తెల్లారేపాటికి పోలీసుల నుంచి తప్పించుకునున్నాడనే వార్త వచ్చింది. అధికారుల అండదండలు కూడా మెండుగా ఉండేవి కాబట్టే అతడి ఆటలు సాగాయనే వారు కూడా లేకపోలేదు. మూడు రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న వీరప్పన్ పట్టుకోవడం మూడు గంటల పని అని అప్పట్లో కొందరు అనేవారు.
2000 సం.లో వీరప్పన్ కన్నడ నటుడు రాజ్కుమార్ను కిడ్నాప్ చేశాడు. 108 రోజులు తన ఆధీనంలోనే ఉంచాడు. ప్రభుత్వాల నుంచి, రాజ్కుమార్ అభిమానుల నుంచి ఎంత వత్తిడి వచ్చినా విడిచిపెట్టలేదు. పైగా రాజ్కుమార్ కిడ్నాప్ ఉదంతాన్ని అడ్డుపెట్టుకుని తిరిగి తన పనులు పూర్తి చేయించుకున్నాడని అంటారు.
2004లో తమిళనాడు స్టేట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేతిలో వీరప్పన్ మరణించాడు. వీరప్పన్ కోసం దశాబ్దాలపాటు వేట సాగింది.. కానీ అతడి అంతం 20 నిమిషాల్లోనే ముగిసింది. ఈ విషయం.. ' వీరప్పన్.. ఛేజింగ్ ద బ్రిగాండ్' పుస్తకంలో కనిపిస్తుంది. వీరప్పన్ని హతమార్చడానికి ఏర్పాటు చేసిన ఆపరేషన్ కొకూన్ని నడిపిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి విజయ్ కుమార్ ఈ బుక్ రాశారు. ఆవిధంగా ఓ కరడు గట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ అయిన వీరప్పన్ జీవితం 52 ఏళ్లకు ముగిసిపోయింది. ఇప్పుడు 'పుష్ప' సినిమా చూసిన తరువాత చాలా మంది వీరప్పన్ ఎపిసోడ్ని గుర్తు చేసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com