MAA Elections 2021: ఫ్యామిలీ జోలికి రావద్దు.. ప్రకాశ్ రాజ్కు మంచు విష్ణు వార్నింగ్

MAA Elections 2021: మా ఎన్నికలు జనరల్ ఎలక్షన్లను తలపిస్తున్నాయి. ఇన్నాళ్లూ కేవలం సినీ రంగానికే పరిమితం అనుకున్నారు. కానీ గత రెండు దఫాలుగా సీన్ మారిపోయింది. ఇప్పుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇలాంటి ఎలక్షన్లు ఇప్పుడు పెద్ద మలుపును తీసుకున్నాయి. 'మా' ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే జరపాలని మంచు విష్ణు.. ఎన్నికల అధికారికి లేఖ రాయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
ఈవీఎమ్లపై తనకు నమ్మకం లేదని.. వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని మంచు విష్ణు అన్నారు. తమ ప్యానల్లో అందరి అభిప్రాయం కూడా ఇదే అన్నారు. గత ఎన్నికలు కూడా బ్యాలెట్ విధానంలోనే జరిగాయని గుర్తుచేశారు. బ్యాలెట్ పెడితే చాలామంది సీనియర్ నటులు ఓటేయడానికి అవకాశం ఉంటుందన్నది మంచు విష్ణు అభిప్రాయం. ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది సీనియర్ నటీనటులే ఉన్నారన్న మంచు విష్ణు... వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ విజ్ఞప్తిని చేసినట్లు కనిపిస్తోంది.
రెండు ప్యానళ్లు విమర్శల జోరు పెంచాయి. ప్రకాశ్ రాజ్ ఫ్యామిలీ గురించి తాను మాట్లాడలేదని అలాంటిది తమ కుటుంబం గురించి మీడియా ముందు ఎందుకు మాట్లాడతారని మంచు విష్ణు ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. మా అంటే సినిమా వారికి కుటుంబం లాంటిదని, అందులో జరిగే ఎన్నికలను ప్రకాశ్ రాజ్ అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రకాశ్ రాజ్ స్థానికత గురించి మొదటి నుంచీ మాట్లాడుతున్న విష్ణు ఇప్పుడు మరోసారి దాని గురించే ప్రస్తావించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com