Karuna Kumar: 'పలాస' దర్శకుడు కరుణ కుమార్కు మరో గౌరవం..

Karuna Kumar: 'పలాస1978' సినిమా విడుదలయి మూడేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ పలాస పేరు ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంది. మేకర్స్కి రిఫరెన్స్ సినిమాగా మారింది. భారతీయ సినిమా తెరమీద సామాజిక బాధ్యత గల సినిమాలతో తమదైన ముద్రను వేస్తున్న దర్శకులు నీరజ్ ఘావన్, నాగరాజ్ ముంజలే, వెట్రిమారన్, పా రంజిత్ సరసన తెలుగు నుండి కరుణ్ కుమార్ పేరు చేరింది.
సామాజిక స్పృహతో దళితులకు రాజ్యాధికారం అనే అంశంను ఇతి వృత్తంగా తీసుకొని సామాజిక చైతన్యం కలిగించిన సినిమాలు ఏ బాషలోనైనా అరుదుగా వస్తాయి. ఒక కథా వస్తువును తీసుకునేందుకు దర్శకుడు పడే తపన ఖఛ్చితంగా అతని వ్యక్తిత్వంలోంచి వస్తుంది. అందుకే పలాస 1978 రిలీజ్ అయి మూడేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ సినిమా ప్రపంచంలో చర్చా వస్తువుగానే ఉంది. కథా రచయితగా నేషనల్ స్థాయి గౌరవం దక్కించుకున్న కరుణ కుమార్ అదే కథా బలంతో సినిమాలు చేస్తున్నారు. చెన్నైలో ఈ నెల 9, 10, 11 లలో p.k.rose పేరిట జరగబోయే ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాబోయే సినిమాలలో పలాస 1978 ఎంపిక అయ్యింది
ఈ సందర్భంగా దర్శకులు కరుణ కుమార్ మాట్లాడుతూః
దళిత జీవనాన్ని, దళిత జీవిత కథా చిత్రాన్ని కథా వస్తువులుగా తీసుకునే పా రంజిత్ 2018 లో వానమ్ ఆర్ట్ ఫెస్టివల్ ని ప్రారంభించారు. కరోనా తర్వాత మళ్ళీ ఈ ఫెస్టివల్ జరగబోతుంది. ఏప్రిల్ నెలను దళిత్ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ మహాశయుని పుట్టిన రోజు పురస్కరించుకొని చేస్తున్న ఈ ఫెస్టివల్లో సాహిత్యం , సినిమా రెండు కూడా ప్రధాన భూమికలు పోషిస్తున్నాయి. దళిత పాలిటిక్స్ ని ఇతివృత్తంగా చేసుకొని చేసిన సినిమాలు ఈ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు. దేశం గర్వించే దర్శకుల సినిమా ల పక్కన పలాస 1978 సినిమాకు చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఫెస్టివల్ లో భాగం అయినందుకు నాకు గర్వంగా కూడా ఉంది. ఒక మంచి ప్రయత్నం చేస్తే దాన్ని భుజాన వేసుకొనే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు అని పలాసతో నాకు అనుభవంలోకి వచ్చింది. దానితో పాటు ఇటువంటి వేదికల మీద పలాస 1978 సినిమా ప్రదర్శించడం దర్శకుడుగా మరిచిపోలేని అనుభవం కాబోతుంది అన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com