Puneeth Rajkumar: పునీత్ రాజ్కుమార్ 'అప్పు' బ్యాక్గ్రౌండ్ స్టోరీ.. పూరీ జగన్నాధ్కు షాక్..
Puneeth Rajkumar (tv5news.in)
Puneeth Rajkumar: పూరీ జగన్నాధ్.. తెలుగులో ఆయనకు ఎంత క్రేజ్ ఉందో.. కన్నడలో కూడా దర్శకుడిగా సేమ్ క్రేజ్ ఉంది. ముందుగా ఆయనను డైరెక్టర్గా శాండల్వుడ్లో నిలబెట్టిన సినిమా 'యువరాజా'. అందులో పునీత్ రాజ్కుమార్ అన్న శివరాజ్కుమార్ హీరో. తెలుగులో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', కన్నడలో 'యువరాజా' సినిమాలను ఒకేసారి తెరకెక్కించారు. పైగా రెండు భాషల్లో ఈ రెండు సినిమాలు హిట్ టాక్ను అందుకున్నాయి. ఇది చూసి ఇంప్రెస్ అయిన రాజ్కుమార్.. పూరీకి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్గా విపరీతమైన క్రేజ్ను సంపాదించుకున్న పునీత్ రాజ్కుమార్ను హీరోగా లాంచ్ చేసే టైమ్ అయ్యిందని భావించారు తండ్రి రాజ్కుమార్. అందుకోసం దాదాపు రెండు సంవత్సరాలు ఎన్నో కథలు విన్నారు. కానీ అప్పటికే స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ను హీరోగా లాంచ్ చేయగలిగే కథ తనకు కనిపించలేదు. యువరాజా తర్వాత పూరీలోని ఛార్మ్ను చూసి ఇంప్రెస్ అయిన రాజ్కుమార్.. పునీత్ను లాంచ్ చేసే అవకాశం ఇస్తానని, కథ వినిపించడానికి రమ్మన్నారు.
అప్పటికే 'ఇడియట్' సినిమా స్టోరీని సిద్ధం చేసుకున్న పూరీ.. అదే కథను రాజ్కుమార్కు వినిపించడానికి వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత పూరీ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాజ్కుమార్తో పాటు తన కుటుంబసభ్యులు అందరూ కథ వినడానికి కూర్చున్నారు. అంటే అందులో రాజ్కుమార్ మనవళ్లు, మనవరాళ్లతో సహా అందరూ ఉన్నారు. చివరికి వారింట్లో పనిచేసే వారు కూడా కథ వినడానికి సిద్దమయ్యారట. ఇదంతా చూసిన పూరీ.. ఏంటిది అని రాజ్కుమార్ను అడగగా పునీత్ను హీరోగా లాంచ్ చేసే కథ వీరందరికీ నచ్చాలి అన్నారట.
అలా అందరి ముందు పూరీ ధైర్యంగా తన కథను వినిపించాడు. అది అందరికీ బాగా నచ్చింది. 'అప్పు' టైటిల్తో తెరకెక్కిన ఈ సినిమా పునీత్ రాజ్కుమార్కు బెస్ట్ డెబ్యూ ఇచ్చింది. అప్పటినుండి ఆయన శాండల్వుడ్ ప్రేక్షకుల మనసులో అప్పుగా ముద్ర వేసుకున్నారు. పూరీ లాంటి దర్శకుడి చేతిలో పడితే ఏ హీరో అయినా మాస్ ఆడియన్స్కు దగ్గరవ్వాల్సిందే. పునీత్ రాజ్కుమార్ కూడా అలాగే మొదటి సినిమాతోనే అందరికీ కనెక్ట్ అయిపోయారు. చాలాసార్లు పూరీని ఆయన గురువుగా భావిస్తాను అన్నారు పునీత్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com