Ram Charan and Chiranjeevi : మెగాస్టార్ బాటలో మెగా పవర్ స్టార్

ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ వంతు సాయం అందించటానికి హీరో చిరంజీవి, రామ్ చరణ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఈ విషయం పలుసార్లు నిరూపితమైంది. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ను స్థాపించి ఇప్పటికే ఎందరికో అండగా నిలిచిన చిరంజీవి.. ప్రజలపై ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడల్లా ఇండస్ట్రీ తరపు నుంచి నేనున్నా అంటూ సాయం చేయటానికి ముందుకు వస్తుంటారు. కరోనా సమయమైనా, హూదూద్ తుపాను సమయంలోనైనా.. ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారంటే తనవంతు అండదండలను అందించటమే కాకుండా తన అభిమానులను సైతం అండగా నిలవమని చెప్పి స్ఫూర్తినిస్తుంటారు చిరంజీవి. రామ్ చరణ్ సైతం తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాదు.. ఇతర రాష్ట్రాల్లోని వారు ఇబ్బందుల్లో ఉన్నా చిరంజీవి స్పందించి తన గొప్ప మనసుని చాటుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా.. విచారాన్ని వ్యక్తం చేయటమే కాకుండా చిరంజీవి తన కుటుంబం తరపు నుంచి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించటమే కాకుండా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ప్రత్యేకంగా కలిసి చెక్ను అందించి వచ్చిన సంగతి తెలిసిందే.
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. వీరిని ఆదుకోవటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. వీరికి తెలుగు చిత్ర పరిశ్రమ బాసటగా నిలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి, రామ్చరణ్లు తమ వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలను వరద బాధితుల సహాయార్థం విరాళంగా ప్రకటించారు. ప్రజలు ఊహించని కష్టమని, జరిగిన నష్టాన్ని ఎవరూ తీర్చలేనిదని, తీవ్రమైన వరదలతో ప్రజలు గణనీయంగా నష్టపోయారని, ఇలాంటి సమయంలో అందరూ వారికి అండగా నిలవాలని వారివురూ ప్రజలను కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com