Puneeth Rajkumar: పునీత్తో రోజాకు ఉన్న అనుబంధం.. మరణ వార్త విని భావోద్వేగం..

Puneeth Rajkumar (tv5news.in)
Puneeth Rajkumar: భాషాబేధం లేకుండా తనతోటి వారితో కలిసిపోయే హీరోల్లో పునీత్ రాజ్కుమార్ ఒకరు. మామూలుగానే సౌత్ హీరోలు అందరు అన్నదమ్ముల్లాగా కలిసుంటారు. అలా పునీత్ కూడా టాలీవుడ్ నటీనటులతో సాన్నిహిత్యంగా ఉండేవారు. అలాంటి పునీత్ అకాల మరణాన్ని ఇప్పటికీ ప్రేక్షకులే కాదు.. సినిమావారు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నటి రోజా కూడా పునీత్తో తనకున్న అనుబంధం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
అప్పు చిత్రంతో హీరోగా శాండల్వుడ్కు పరిచయమయ్యారు పునీత్ రాజ్కుమార్. ఆ సినిమాను మన తెలుగు దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేశారు. ఇందులో హీరో మ్యానరిజమ్ వల్ల పునీత్కు మొదటి సినిమాతోనే మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే పూరీ రాసిన ఇంకో కథను ఎంచుకొని రీమేక్ చేశారు పునీత్. తెలుగులో 'అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి' చిత్రాన్ని 'మౌర్య'గా కన్నడ ప్రేక్షకులకు పరిచయం చేశారు.
తెలుగులో రవితేజ, జయసుధ చేసిన పాత్రల్లో కన్నడలో పునీత్ రాజ్కుమార్, రోజా చేశారు. ఈ సినిమాలో వీరి నటన అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పునీత్ మరణ వార్త తెలియగానే మౌర్య సినిమా విశేషాలను మరోసారి గుర్తుచేసుకున్నారు రోజా.
ఆ సినిమా తర్వాత పునీత్.. రోజాను మమ్మీ అంటూ పిలవడం మొదలుపెట్టారట. పునీత్ మరణం గురించి తెలిశాక తనకు నోట మాట రావడం లేదన్నారు రోజా. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. పునీత్కు తల్లిగా నటించిన రోజా.. తన అన్న శివరాజ్కుమార్ హీరోగా నటించిన పలు సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com