Salman Khan : సల్మాన్ ఖాన్కు మళ్లీ బెదిరింపులు.. రూ.5కోట్లు ఇవ్వాలంటూ వార్నింగ్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్కు ఈ మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఈ మెసేజ్ వచ్చింది. తమ బెదిరింపులను ఈజీగా తీసుకోవద్దని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5కోట్లు చెల్లించాలన్నారు.
డబ్బులు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా ఈ మెసేజ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మెసేజ్ ఎక్కడినుంచి వచ్చిందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు ముంబయి పోలీసులు. ఈనేపథ్యంలో బాంద్రాలోని ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ఖాన్కు ఇలా బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్లో సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతకుముందు పన్వేల్ ఫామ్హౌస్లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించారు. సల్మాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గతేడాది మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com