shakuntalam: శాకుంతలంలో 'సమంత'.. ఎవరీ 'శకుంతల'.. ఏమా కథ..

shakuntalam: శాకుంతలంలో సమంత.. ఎవరీ శకుంతల.. ఏమా కథ..
shakuntalam: అరణ్య మార్గం గుండా వెళుతున్నప్పుడు కణ్వ మహర్షి ఆశ్రమాన్ని చూస్తాడు దుష్యంతుడు. పక్కనే మాలినీ నది ప్రవహిస్తుంటుంది.

shakuntalam: పురాణ కథలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటాయి.. రామాయణ, మహాభారతాలు, మరికొన్ని పురాణగాధలల్లో ఏ చిన్న అంశం చూసినా దాని గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలం. అది సినిమా రూపంలో వస్తే ప్రేక్షకులకి మరింత నచ్చుతుంది..

విశ్వామిత్ర, మేనక స్టోరీలు, శకుంతల దుష్యంతుల స్టోరీతో చాలా సినిమాలు వచ్చినా దర్శకులు అదే కథను కొత్త కోణంతో తీస్తూ ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎదురు చూసేలా చేస్తుంటారు. టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ పురాణ గాధలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు.. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా శాకుంతలం. ఆ పాత్ర సమంత చేయడంతో ఆ పినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు డైరెక్టర్.. ఇంతకీ ఏంటా స్టోరీ.. ఎవరీ శకుంతల..

రుషి విశ్వామిత్రుడి తపస్సును భగ్నం చేసేందుకు భువి నుంచి దివికి దిగి వస్తుంది మేనక. విశ్వామిత్రుడు ఆమె అందానికి ముగ్ధుడవుతాడు.. తపస్సు విషయం మర్చిపోతాడు.. వారిద్దరి కలయికకు గుర్తుగా చిన్నారి జన్మిస్తుంది.. అయితే విశ్వామిత్రుడు అప్పటికి గాని విషయాన్ని గ్రహించలేకపోతాడు, బిడ్డను, భార్యను వదిలి హిమాలయాలకు వెళ్లి పోతాడు తపస్సు చేసుకోవడానికి..

మేనక బిడ్డను తీసుకుని వస్తే దేవలోకంలో ప్రవేశం లేదంటారు దేవతలు.. అందుకే పుట్టిన బిడ్డను బాధాతప్త హృదయంతో దట్టమైన అరణ్యంలో వదిలేసి వెళుతుంది. ఒక రోజు కణ్వ మహర్షి తన ఆశ్రమానికి సమీపంలో పక్షుల గుంపు ఉండడాన్ని చూస్తారు. వెళ్లి చూస్తే అక్కడ ఓ చిన్నారి కనిపిస్తుంది..

చుట్టుపక్కల ఆ చిన్నారి తాలూకు వాళ్లు ఎవ్వరూ కనిపించకపోవడంతో ఆ పసికందును తానే పెంచుకోవాలని నిర్ణయించుకుంటాడు.. ఆమెకు శకుంతల అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. శకుంతల పెరిగి పెద్దదవుతుంది.

ఓ రోజు ఆ దేశపు రాజు దుష్యంతుడు వేటకు బయలుదేరుతాడు.. వేట ధ్యాసలో పడి వెళ్తుంటాడు. కొంతదూరం ప్రయాణించేసరికి అతడికి మనిషి జాడ కనిపించదు. అక్కడంతా వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. అరణ్య మార్గం గుండా వెళుతున్నప్పుడు కణ్వ మహర్షి ఆశ్రమాన్ని చూస్తాడు దుష్యంతుడు. పక్కనే మాలినీ నది ప్రవహిస్తుంటుంది.

నదిలో నీళ్లు తాగుతున్న జింకపైకి బాణం గురిపెడతాడు.. దాంతో జింక విల విలలాడుతుంది. గాయపడిన జింకను చూసి శకుంతల చాలా బాధపడుతుంది. ఆశ్రమంలోకి తీసుకు వెళ్లి చికిత్స చేస్తుంది. ఆమె జింకపై చూపిస్తున్న ప్రేమకు ముగ్ధుడవుతాడు దుష్యంతుడు.

జింకపై బాణం వేసినందుకు క్షమించమని వేడుకుంటాడు.. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు.. రాజ్యం వదిలి ఆశ్రమంలోనే గడుపుతాడు దుష్యంతుడు. శకుంతలను వివాహం చేసుకుంటాడు. రాజు లేని రాజ్యంలో అశాంతి నెలకొందని సమాచారం రావడంతో శకుంతలను ఆశ్రమంలోనే విడిచి తన రాజ్యానికి బయలుదేరుతాడు దుష్యంతుడు. దుష్యంతుడు తన ప్రేమకు చిహ్నంగా శకుంతలకు ఉంగరాన్ని ఇస్తాడు. తిరిగి వస్తానని ఆమెకు హామీ ఇచ్చి రాజ్యానికి వెళతాడు.

శకుంతల తన భర్త గురించి కలలు కంటూ పరధ్యానంలో ఉండేది. ఒకరోజు దుర్వాస మహాముని ఆశ్రమానికి వస్తాడు. శకుంతల పరధ్యానంలో ఉన్నందున అతడని పలకరించదు. దాంతో ఆగ్రహించిన ఋషి శకుంతలను శపిస్తాడు. నువ్వు కలలు కంటున్న వ్యక్తి నిన్ను పూర్తిగా మరచిపోతాడు అని శపిస్తాడు అని ఆవేశంతో వెళ్ళిపోతాడు.

కానీ శకుంతల స్నేహితులు ఆమెను మన్నించమని అడుగుతారు.. శాప విముక్తిని ప్రసాదించమని కోరుతారు దుర్వాస మహామునిని. అయితే దుష్యంతుడు ఇచ్చిన ఏదైనా వస్తువును చూపితే గుర్తు పడతాడు అని చెప్పి వెళ్లిపోతాడు దుర్వాసుడు.


దుర్వాసముని శాపం కారణంగా దుష్యంతుడు శకుంతలను గుర్తించలేడు. తన భర్త తనను గుర్తించకపోవడంతో అవమానంగా భావించి, కుమారుడు భరతుడిని తీసుకుని తిరిగి ఆశ్రమానికి వచ్చేస్తుంది. ఇంతలో ఒక మత్స్యకారుడు తాను పట్టిన చేప కడుపులో రాజుగారి ఉంగరం ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు.

అతను ఉంగరాన్ని రాజభవనానికి తీసుకువెళ్లి రాజుగారికి చూపుతాడు. దాన్ని చూడగానే, దుష్యంతునికి తన భార్య శకుంతల జ్ఞప్తికి వస్తుంది. వెంటనే ఆమెను వెతకడానికి ఆశ్రమానికి బయలుదేరుతాడు. కానీ ఆమె అక్కడ లేదని తెలుసుకుంటాడు. అతడు తన భార్యను కనుగొనడానికి అడవిలో అన్వేషిస్తాడు.

అక్కడ ఒక చిన్న పిల్లవాడు సింహం నోరు తెరిచి దాని దంతాలు లెక్కించే పనిలో బిజీగా ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. రాజు బాలుడిని పలకరించి అతని ధైర్యాన్ని మెచ్చుకుంటాడు. నీ పేరేంటి అని అడుగుతాడు. అతడు దుష్యంత రాజు కొడుకు భరతుడని సమాధానం చెప్పడంతో దుష్యంతుడు అవాక్కవుతాడు. బాలుడు అతనిని తల్లి శకుంతల వద్దకు తీసుకువెళతాడు. కుటుంబం అంతా తిరిగి కలుసుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story