Sankarabharanam : స్టార్ హీరో లేడు.. పైగా వ్యాంప్ హీరోయిన్‌‌తో సినిమా.. 'శంకరాభరణం' తెరవెనుక విశేషాలు..!

Sankarabharanam : స్టార్ హీరో లేడు.. పైగా వ్యాంప్ హీరోయిన్‌‌తో సినిమా.. శంకరాభరణం తెరవెనుక విశేషాలు..!
Sankarabharanam : టాలీవుడ్‌‌లో ఇప్పటివరకు చాలా చిత్రాలు వచ్చాయి కానీ కొన్ని చిత్రాలు మాత్రమే క్లాసిక్‌‌గా మిగిలిపోయాయి.. అందులో ఒకటి 'శంకరాభరణం'.

Sankarabharanam : టాలీవుడ్‌‌లో ఇప్పటివరకు చాలా చిత్రాలు వచ్చాయి కానీ కొన్ని చిత్రాలు మాత్రమే క్లాసిక్‌‌గా మిగిలిపోయాయి.. అందులో ఒకటి 'శంకరాభరణం'.. కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో సంగీతం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల(ఫిబ్రవరి 02)తో 42 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా శంకరశాస్త్రి పాత్రకి అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషణ్ వంటి వారిని అనుకున్నారట దర్శకుడు విశ్వనాథ్. ఆ తరువాత కృష్ణంరాజుకు కథను వినిపించారట. అయితే ఆ పాత్ర తనకు కొత్తని, దాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణంరాజు తిరస్కరించారట.. చివరగా ఇమేజ్ ఉన్న నటులు ఈ పాత్రను చేస్తే పండదని అలోచించి ఎలాంటి ఇమేజ్ లేని జేవీ సోమయాజులతో ఈ పాత్రని వేయించారు విశ్వనాథ్.. ఆ సమయంలో ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఇక తులసి పాత్రకి అప్పటికే వ్యాంప్ పాత్రలతో ఫేమస్ అయిన మంజుభార్గవిని ఎంపిక చేశారు విశ్వనాథ్.. ఈ చిత్రాన్ని పదమూడున్నర లక్షల రూపాయలతో 60 రోజుల్లో పూర్తిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో స్టార్ హీరో కానీ ఓ నటుడుతో, వ్యాంప్ పాత్రలు చేసిన మంజుభార్గవితో, సంగీత ప్రధానమైన కథతో విశ్వనాథ్ పెద్ద సాహసాన్ని చేస్తున్నారని మురళిమోహన్ లాంటి హీరోలు అనుకున్నారట. 1980 ఫిబ్రవరి 2న రిలీజైన ఈ సినిమాకి ముందుగా ప్రేక్షకులే లేరు కానీ నెమ్మదిగా జనం రావడం మొదలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.. ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు చెప్పులు బయటే విడిచి సినిమా హాల్ లోకి వచ్చారట.

కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి అపట్లో శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి ఈ చిత్రం మేలిమలుపు అయ్యింది. అంతగా పేరులేని నటీనటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకి గాను తొలిసారిగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే శాస్త్రీయ సంగీతమైన పాటలు పాడడం నా వల్ల కాదు బాబోయ్ అని బాలు తప్పించుకుందామని చూసిన విశ్వానాథ్ పట్టుబట్టి ఆయనచేతే పాటించారు. అవి ఎంత హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని దాదాపుగా అన్ని పాటలు ఆయనే పాడడం విశేషం.

కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆయనకి కూడా జాతీయ అవార్డు లభించింది. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా జనంపై ఎంత ప్రభావం చూపించిందో.. ఇక ఈ సినిమాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జంధ్యాల మాటలు, వేటూరి పాటలు.. ఒక్కో మాట, పాట అద్భుతమే. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాల్లో భాగంగా శంకరాభరణం సినిమా గురించి ఏకంగా మూడు రోజులు విశ్లేషించారంటే అంతటి మహా మహుల్ని కూడా ఎంతగానో అలరించింది ఈ చిత్రం. అందుకే ఎన్ని ఏళ్లు గడిచినా శంకరాభరణం గురించి ఎంత చెప్పినా తక్కువే అని భావిస్తారు సినీ ప్రేక్షకులు.

Tags

Read MoreRead Less
Next Story