50 సినిమాలకు సంగీతం అందించిన బాలు.. అవి ఇవే..

50 సినిమాలకు సంగీతం అందించిన బాలు.. అవి ఇవే..

సంగీత ప్రపంచంలో పాటల రారాజు గా వెలుగొందుతూనే.... బాల సుబ్రమణ్యం స్వర కర్తగానూ కొన్ని మైలురాళ్ళను నెలకొల్పారు. ఏ గాయకుడికి దక్కని అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశానికి బాలు తనదైన ప్రతిభతో కొత్త సొగసులు అద్దారు. బాలు సంగీత స్వర ప్రయాణంలో అరుదైన పాటలు వేలల్లోనే ఉన్నాయి. గాయకుడిగానే కాకుండా స్వరకర్తగా బాలు గౌరవ ప్రదమైన ప్రయాణం చేసారు. గాయకుడుగా 40 వేల పాటలకు ప్రాణం పోసిన బాలు, 50 చిత్రాలకు పైగా సంగీతం అందించారు. సంగీతం లోని అణువణువునూ తనలో నింపుకున్న ఈ అమర గాయకుడి స్వర ప్రయాణంలోని కొన్ని మధుర గీతాలను ఇప్పుడు చూద్దాం..

కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో, ప్రయోగాలకు ముందుండంలో దిట్ట అయిన దాసరి నారాయణరావు గారి చొరవతో బాల సుబ్రమణ్యం స్వరకర్తగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం కన్యాకుమారి. నరసింహారాజు, శ్రీవిద్య జంటగా నటించిన ఈ చిత్రం లోని పాటలు ఆదరణ పోందాయి. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలోనే మరో రెండు సినిమాలకు సంగీతం అందించారు బాల సుబ్రమణ్యం. దాసరి చేసిన మరో ప్రయోగాత్మక చిత్రం సంగీతకు బాల సుబ్రమణ్యం సంగీతం అందించారు.

దాసరి ప్రోత్సాహంతో సంగీత దర్శకుడిగా మారిన బాలసుబ్రమణ్యం అదే ప్రోత్సాహాంతో ప్రయోగాత్మక చిత్రాలకే కాదు.. క్రేజీ కాంబినేషన్స్ కి స్వరాలు సమకూర్చారు. అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ క్రిష్ణ కాంబినేషనలోని మూవీ ఊరంతా సంక్రాంతికి బాలు అందించిన స్వరాలు ఆ సినిమా మూడ్ ని మరింత ఎలివేట్ చేసి నిజంగానే టైటిల్ కి తగ్గట్టు పండగలాంటి పాటలతో హుషారెత్తించారు బాలు. ఆ సినిమా విజయంలో బాలు ముద్ర స్పష్టంగా కనిపించింది.

దాసరి వేసిన పునాదులపై బాలు స్వర ప్రయాణం జోరందుకుంటున్న సమయంలో ఆ ప్రయాణంకి సరికొత్త దారి చూపించారు దర్శకుడు బాపు. బాలుపై సంగీత దర్శకులు సత్యం, రమేష్ నాయుడుల ప్రభావం మెండుగా ఉండేది. ఆ ప్రభావంలో నుంచి బయటకు తెచ్చే ప్రయత్నంలో దర్శకుడు బాపు సక్సెస్ అయ్యారు. సత్యం గారిని బాలు నాన్న అని పిలుచుకునే వారు. ఆ ప్రేమ తన సంగీతం మీద కూడా తెలియకుండా పడేది. సత్యం గారి పాటల్లో వినిపించే గిటార్, డోలక్, దరువు శబ్దాలు బాలు మ్యూజిక్ లో కూడా వినిపించేవి ఆ ప్రభావం నుండి బయటకు తెచ్చి న బాపు బాలును స్వరకర్తగా మరో ఫేజ్ లోకి తీసుకెళ్ళారు..

అనుకరణ నుండి బయట పడి తన సహాజత్వంలో ప్రయాణం చేయడం నేర్చుకున్న బాలు స్వరరాగ ప్రయాణం మరింత అందంగా సాగింది. నటన నుండి సహాజ నటన రాబట్టుకున్నట్లే సంగీత దర్శకుడి గా ఉన్న బాలు నుండి కూడా అదే పని చేసారు బాపు ఆ ప్రభావం నుండి బయటకు వచ్చిన బాలు చేసిన సంగీతం తొలి పొద్దు అంత అందంగా మారింది. బాలు స్వర కర్తగా తన దారిని తాను వేసుకోవడం మొదలు పెట్టారు. దానికి అత్యంత ప్రతిభావంతుడైన బాపు అండదండలు దొరకడంతో ఆ ప్రయాణం మరింత కొత్త గా మారింది. వీరి ప్రయాణం తూర్పు వేళ్ళే రైలుతో మొదలయ్యి సీతమ్మ పెళ్ళి , జాకీల వరకూ సాగింది...

యాక్సిడెంటల్ గా డైరెక్టరైన విజయబాపినీడుతో ఎస్పీ బాల సుబ్రమణ్యంకి జత కుదిరింది. వీరి కాంబినేషలో నాలుగు సినిమాలకు పనిచేసారు. విజయ బాపినీడు అనగానే ఈ జనరేషన్ కి 'గ్యాంగ్ లీడర్' సినిమా గుర్తుకొస్తుంది గానీ, ఆయన మొదట్లో సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామాలు తీశారు. లేడీస్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను మెప్పించారు. అప్పుడు లేడీస్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న శోభన్ బాబుతో 'భార్యామణి, కొంగుమడి' లాంటి సినిమాలు తీశారు. ఈ రెండిటికి బాలునే సంగీతం చేశారు.

విజయ బాపినీడు దర్శకత్వంలో సుమన్, విజయ శాంతి జంటగా నటించిన 'దొంగల్లో దొర' చిత్రానికి కూడా బాల సుబ్రమణ్యమే సంగీతం అందించారు. మాస్ అప్పీల్ తో వచ్చిన ఈ చిత్రానికి బాలు పాటలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. విజయ బాపినీడుకి పెద్దగా టెక్నీషన్స్ ని మార్చే అలవాటు లేదు. కంపెనీ ఆర్టిస్టుల లాగానే ఆయనకు టెక్నికల్ టీం లో కూడా పెద్ద మార్పులుండవు.. దీంతో విజయ బాపినీడు, బాల సుబ్రమణ్యం కాంబినేషన్ కొనసాగింది. బాల సుబ్రణ్యానికి కొన్ని ప్రయోగాలను చేసే అవకాశం దొరికింది..

గాయకుడిగా బాల సుబ్రమణ్యం పాడని బాణి లేదు.. సంగీత దర్శకుడిగా కూడా ఆయన ఆ రోటీన్ బ్రేక్ కి కొనసాగించారు.. అన్ని రకాల పాటలు పాడిన బాలు.. తన స్వర పరిచిన బాణీలు కూడా అన్ని వైవిధ్యాలుండేలా చూసుకున్నారు. మాస్, క్లాస్, భక్తి, రక్తి పాటలతో పాటు కామెడీ సాంగ్స్ కూడా పాడారు. ఇలాగే రకరకాల జానర్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్స్ తీసిన జంధ్యాల సినిమాలకు ఎక్కువగా సంగీతం అందించారు బాలు. హాస్య చక్రవర్తి జంధ్యాల దర్శకత్వంలో 5 సినిమాలకు పనిచేసారు.

బాలు పాటలు.. జంధ్యాల మాటలు తెలుగు తెరంతా పరుచుకుంటున్న టైం లో వీరిద్దరూ కలిసి కొన్ని పాటలకు పురుడు పోసారు. అలా మాట, పాటగా మారిన వీళ్లిద్దరు దర్శకులు, సంగీత దర్శకులుగా అయిదు సినిమాలకి పనిచేశారు. ఒకరకంగా చెప్పాలంటే జంధ్యాల సినిమాలకే బాలు ఎక్కువగా సంగీతం అందించారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన మొదటి ఆల్బమ్ 'ముద్దుల మనవరాలు'. ఈ చిత్రంలో భానుమతి, సుహాసిని అమ్మమ్మ మనవరాలిగా నటించారు.

సాంప్రదాయాలు.. ఎల్లలు .. వీటిని గెలిచిన ప్రేమ ఎలా ఉంటుంది.. అనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా పడమటి సంధ్యారాగం. ఆ సినిమా అప్పట్లో వస్తున్న సినిమాలలో పూర్తి భిన్నమైనది. విజయశాంతికి జంటగా ఒక అమెరికన్ నటుడు థామస్ జాన్ నటించిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ అనుకోవచ్చు. ఆ సినిమాలో ని ఈ తూరుపు ఆ పడమర సాగిన సంగమమే...అనే పాట హాద్దులు లేని ప్రేమకు స్వర నీరాజనం చేసింది. ఆ సినిమాకు స్వరాలందించిన బాలుకు, సినిమా కు ఎంత పేరు వచ్చిందో ఆయన పాటలకు అంతే పేరు వచ్చింది.

నవ్వులవిందు లాంటి జంధ్యాల సినిమాలలో హాయిగా ఉండే స్వరాలు.. కామెడీ ట్రాక్ లకు సరిపోయే నేపథ్య సంగీతాలు అందించడంలో బాలు సక్సెస్ అయ్యారు. వారి ప్రయాణం నాలుగు నవ్వలు..ఆరు పాటలుగా హాయిగా సాగిపోయింది..జంధ్యాల సునిశిత హాస్యం.. హాయిగా సాగే పాటలు వీరి జంటను విజయవంతం చేసారు ప్రేక్షకులు..జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన 'వివాహభోజనంబు, నీకూ నాకూ పెళ్లంట' సినిమాలకు కూడా బాలు సంగీతం అందించారు. రాజేంద్రప్రసాద్, అశ్విని జంటగా నటించిన 'వివాహభోజనంబు' సినిమాలో కామెడీ ట్రాక్స్ కి ఎంత రెస్పాన్స్ వచ్చాయో ఎస్పీబీ చేసిన సంగీతానికి అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలకు బాలు సంగీత దర్శకత్వం అందించారు. స్టార్ హీరోలు చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున ముగ్గురికీ సంగీతం ఇచ్చారు. విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, జయసుధ జంటగా నటించిన 'మగధీరుడు'సినిమాకి బాలు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. పుల్ లెంగ్త్ ఫ్యామిలీ సెంటెమెంట్ తో నడిచే ఈ సినిమాతో చిరంజీవి ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యారు.. బాలు స్వరాలు ఈ సినిమా కి పెద్ద అసెట్ గా మారాయి...

రామానాయుడు స్టూడియోస్ లో బాలక్రిష్ణ, రజినీ జంటగా నటించిన 'రాము' సినిమాకి కూడా బాలసుబ్రమణ్యం మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. రాము సినిమా బాల కృష్ణ స్టార్ డమ్ ని కొనసాగించింది. బాలు గాయకుడిగా చాలా బిజీ గా ఉండే సమయం అది. అయినా రామానాయుడు కోరిక మేరకు ఆయన ఆసినిమాకు స్వరకర్తగా మారారు.. ఆ సినిమాలో యూత్, మాస్ ఆకట్టుకునే స్వరాలతో బాలు చేసిన మ్యాజిక్ తెరమీద విజల్స్ వేయించింది..

నాగార్జున సినిమాకీ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు బాల సుబ్రమణ్యం. ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో నాగార్జున, విజయశాంతి జంటగా నటించిన 'జైత్రయాత్ర'కి సంగీతం అందించారు బాలు. కమర్షియల్ గా ఆ మూవీ విజయం సాధించకపోయినా బాలు స్వర పరిచిన ఎన్నాళ్ళమ్మ ఏన్నేళ్ళమ్మా ఈ చీకిటి పాటకు చాలా మంచి పేరు వచ్చింది.. ఆ పాట ఇప్పటికీ తెలుగు హిట్ సాంగ్స్ లో ఉంటుంది.

ప్రమాదంలో కాలు కోల్పోయినా అధైర్య పడకుండా ఇష్టమైన డాన్స్ ని కంటిన్యూ చేసిన సుధా రామచంద్రన్ కథాంశంతో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సినిమా 'మయూరి'. ఉషాకిరణ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి బాల సుబ్రమణ్యం సంగీతం అందించారు. ఇక ఇదే సినిమాని హిందీలో ఉషా కిరణ్ ఫిల్మ్స్ 'నాచే మయూరి' పేరుతో రీమేక్ చేసింది. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ మూవీకి బాలసుబ్రమణ్యం నేపథ్య సంగీతం అందించారు. ఇక ఈ సినిమా తమిళ్లోనూ 'మయూరి' పేరుతో డబ్ అయ్యింది.

బాలసుబ్రమణ్యం మొత్తంగా 50 సినిమాల వరకు సంగీతం అందించారు. తెలుగులో 30 సినిమాలు, కన్నడలో 9 చిత్రాలు, తమిళ్లో 5, హిందీలో 2 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు బాలు. అయితే ఒక 15 ఏళ్ల వరకు సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఢబుల్ షిప్టులు పనిచేసిన బాలసుబ్రమణ్యం తొంభైల్లో సంగీతం నుంచి బ్రేక్ తీసుకున్నారు. సింగింగ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గాయకుడిగా శిఖరాగ్ర ఖ్యాతనార్జిన బాలు స్వర కర్త గా కూడా గౌరవాన్ని పోందారు. బాల సుబ్రమణ్యం సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సత్కారాల కంటే ప్రేక్షకుల గుండెల్లో ఒక మంచి పాట గా మిగిలిన జ్ఞాపకంగానే ఆయన గర్తుండిపోతారు.

Tags

Read MoreRead Less
Next Story