Srimanthudu : యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న 'శ్రీమంతుడు'

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' యూట్యూబ్లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన మొదటి తెలుగు పూర్తి సినిమాగా అవతరించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'శ్రీమంతుడు' 8 సంవత్సరాల క్రితం 2015లో విడుదలై భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వం వహించిన 'శ్రీమంతుడు' బాక్సాఫీస్ వద్ద నాన్-బాహుబలి హిట్గా నిలిచింది. అయితే తాజాగా 'శ్రీమంతుడు' ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించాడు. యూట్యూబ్లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన తొలి తెలుగు పూర్తి సినిమాగా నిలిచింది. యూట్యూబ్లో కూడా అత్యధికంగా ఇష్టపడిన తెలుగు చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.
'శ్రీమంతుడు' పూర్తి సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సెప్టెంబరు 13, 2017న యూట్యూబ్లోకి అప్లోడ్ చేసారు. గత ఐదేళ్లలో, ఈ చిత్రం భారీ వీక్షకులను సంపాదించుకుంది. దాంతో పాటు ప్రేక్షకుల నుండి 8.3 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. ఈ క్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. పలు పోస్టులతో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
'శ్రీమంతుడు' మూవీని గ్రామ వాతావరణం, అక్కడి సమస్యలు, ఇతర విషయాల ఇతివృత్తంతో రూపొందించారు. ఇది తన తండ్రి జన్మస్థలమైన గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆదర్శవంతమైన యువకుడి కథను చెబుతుంది. ఈ సినిమా మనకు గ్రామాల ప్రాముఖ్యతను, మానవీయ విలువలను నేర్పుతుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా.. ఆమె తండ్రిగా రాజేంద్ర ప్రసాద్, ప్రతి నాయకుడి పాత్రలో జగపతి బాబు, సంపత్ నంది, రాహుల్ రవీంద్రన్, అలీ, వెన్నెల కిషోర్, సుకన్య లాంటి పలువురు ప్రముఖ నటుడు ఈ సినిమాలో పలు పాత్రలు పోషించారు. కాగా రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అనేక అవార్డులు కూడా వచ్చాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవిశంకర్, సివి మోహన్లు 'శ్రీమంతుడు' చిత్రాన్ని నిర్మించారు. మహేష్ బాబు తన బ్యానర్ అయిన GMB ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సినిమా నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com