SS Rajamouli: చిరంజీవిని చాలామంది చాలా మాటలు అన్నారు- రాజమౌళి
SS Rajamouli: చిరంజీవికి అవమానం జరిగింది. చిరంజీవి మాటలు పడాల్సి వచ్చింది. ఎవరెవరో నానా మాటలు అంటున్నా.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాటన్నింటినీ భరించాల్సి వచ్చింది. కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో లోలోన జరుగుతున్న చర్చకు ఓ ట్రైలర్ వదిలారు రాజమౌళి. ట్రిపుల్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గురించి మాట్లాడుతూ రాజమౌళి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటనే దానిపై ఇండస్ట్రీలోనూ పెద్ద చర్చ జరుగుతోంది.
ఇండస్ట్రీని నెగ్గించడానికి.. చిరంజీవి చాలా చాలా తగ్గి మాట్లాడారు అంటూ డైరెక్టుగానే కామెంట్ చేశారు ఈ దర్శకదిగ్గజం. పది నెలల క్రితం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల తెలుగు సినిమా పరిశ్రమ ఎంత ఇబ్బంది పడిందో ఒక్కమాటతో చెప్పేశారు. టికెట్ రేట్ల విషయంలో జగన్ ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి, జగన్ ప్రభుత్వానికి అర్ధమయ్యేట్టు వివరించడానికి చాలా ఇబ్బందిపడ్డామని వ్యాఖ్యానించారు.
వ్యక్తిగతంగా తాను కూడా జగన్ వద్దకు వెళ్లి ఓ ప్రయత్నం చేశానని కన్నడ గడ్డపై చెప్పుకొచ్చారు రాజమౌళి. చివరికి ఏపీలో తీసుకొచ్చిన జీవో రద్దు కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రయత్నించి విఫలమైందని కామెంట్ చేశారు. అలాంటి సమయంలో చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం, కొత్త జీవో రావడం జరిగిపోయిందన్నారు రాజమౌళి. చిరంజీవి రావడం, జీవో వచ్చేయడం అనే మాటల మధ్యలో.. చిరంజీవి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు పడ్డారో అందరికీ తెలుసంటూ చెప్పడంపై ఫ్యాన్స్లో చర్చ జరుగుతోంది.
ఇండస్ట్రీకి అనుకూలమైన జీవో తీసుకురావడం కోసం.. ఒకటికి రెండుసార్లు స్వయంగా చిరంజీవే వెళ్లి కలవాల్సి వచ్చింది. చిరంజీవి స్వయంగా అగ్రహీరోలను, దర్శక నిర్మాతలను వెంట తీసుకెళ్లాల్సి వచ్చింది. జగన్ ముందు చేతులు జోడించి ప్రాధేయపడాల్సి వచ్చింది. దీనిపై అప్పట్లోనే ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. అంత పెద్ద స్టార్ ప్రభుత్వానికి మొక్కి మరీ అభ్యర్థించడంపై ఇండస్ట్రీలోని చాలా మంది పెద్దలు లోలోన రగిలిపోయారు. నిజానికి రాజమౌళి మాటల్లో నాడు ఎదురైన పరిస్థితుల గురించి చెప్పింది కొంతేనని, బయటకు చెప్పలేని ఆ విషయాలు చాలా ఉన్నాయనేది మరికొందరి వాదన.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com