Keerthy Suresh : కీర్తి సురేష్, సుహాస్ .. ఓ స్మశాన పంచాయితీ

కీర్తి సురేష్, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’. అనిల్ ఐవి శశి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రాధిక లావు నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అనగనగనగా ఒక ఊరిలో జరిగిన కథ అంటూ మొదలైన ట్రైలర్ చూస్తే.. ఇదో పీరియాడిక్ విలేజ్ డ్రామా అనిపిస్తోంది. ఓ ఊహా జనితమైన గ్రామంలో ఊరి పెద్ద చనిపోతే.. అతని స్థానంలో ఆ గ్రామానికి అతని కూతురును పెద్దగా చేస్తారు. ఏమీ తెలియని అమాయకురాలైన ఆ అమ్మాయి ఊరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నానా తిప్పలు పడుతుంది. అయితే చిన్నా అనే యువకుడు ఊరి స్మశానంలో కేవలం నాలుగు శవాలు పూడ్చడానికి మాత్రమే స్థలం ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని పంచాయితీలో చెబుతాడు.
ఆ ఊరిలో రెండు వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో ఆ నాలుగు స్థలాలు మాకంటే మాకు అంటూ కొట్టుకు చస్తుంటారు. లాటరీ తీసి ఒకరికి ఇస్తారు. కట్ చేస్తే ఒక ప్రమాదంలో నలుగురు ఒకేసారి చనిపోతారు. మరి ఈ సమస్యను ఊరి పెద్ద అయిన ఆ అమ్మాయి ఎలా పరిష్కరించింది అనే కోణంలో సాగే కథనంలా ఉంది. ట్రైలర్ లోనే కథంతా చెప్పేశారు. అంటే కథనంతో మెప్పించాలి. అదంత సులువేం కాదు అనిపించేలా ఉంది.
నిజానికి ఈ ట్రైలర్ ఎక్కడా ఎంగేజింగ్ గా లేదు. ఏ మాత్రం ఆకట్టుకునేలా కనిపించడం లేదు. కీర్తి సురేష్, సుహాస్ అంటే ఇంకేదైనా కొత్త పాయింట్ తో వస్తారు అనుకున్నారు. బట్ స్మశానం ముందు ‘హాలు నిండినది’అని బోర్డ్ పెట్టేంత సిల్లీ ఐడియాతో వస్తారనుకోలేదు. పైగా ఈ జెనరేషన్ లో ఇది అస్సలు కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా కాదు. కాకపోతే ఈ మూవీకి ఓపెనింగ్ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇది ఓటిటి బొమ్మ. అమెజాన్ ప్రైమ్ లో జూలై 4 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. మరి ఈ స్మశాన పంచాయితీ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com