మృతిచెందిన అభిమానుల కుటుంబానికి అండగా నిలిచిన సూర్య

మృతిచెందిన అభిమానుల కుటుంబానికి అండగా నిలిచిన సూర్య
మరో మారు పెద్ద మనసు చాటుకున్న నటుడు సూర్య

తమిళ నటుడు సూర్య (Suriya).. ఇటీవల తన పుట్టినరోజు బ్యానర్‌ను కడుతుండగా తనువు చాలించిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు అండంగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నక్కా వెంకటేష్, పోలూరి సాయి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు మద్దతును అందిస్తానని సూర్య హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులతో సూర్య వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తానని, ఉద్యోగం కూడా ఇప్పిస్తానని సూర్య హామీ ఇచ్చారు. "దయచేసి నా సంతాపాన్ని అంగీకరించండి. జరిగిన దానికి నేను తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. ఇది నన్ను చాలా బాధపెడుతుంది. ఇది నిజంగా అన్యాయం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మోపులవారిపాలెం గ్రామంలో బ్యానర్‌ను ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. క్యాంపస్ హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థులను రక్షించడంలో, పర్యవేక్షించడంలో సంస్థ విఫలమైందని మరణించిన విద్యార్థులలో ఒకరి సోదరి ఆరోపించారు. ఈ విషాద మరణాలకు కళాశాల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కళాశాలలో విద్యార్థుల పట్ల ఎలాంటి శ్రద్ధ, రక్షణ కరువైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సూర్య పెద్దమనుసును ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇదే కాదు సూర్య ఎల్లప్పుడూ సామాజిక సేవ, స్వచ్ఛంద సంస్థలో చేసే కార్యక్రమాల్లో భాగమవుతూ ఉంటారు. అంతే కాదు ఆయన అనేక మంది విద్యార్థులకు వారి విద్య కోసం ఫీజును కూడా అందించారు.

ఈ తరహా విషాధ సంఘటనలు జరగడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ అభిమానులు తమ అభిమాన తారలను సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఇలాంటి విషాదాలు సంభవించాయి. సెప్టెంబర్ 2020లో, నటుడు పవన్ కళ్యాణ్ గౌరవార్థం బ్యానర్ కట్టేటప్పుడు విద్యుదాఘాతం కారణంగా అతని అభిమానులు ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు అభిమానుల వేడుకల సమయంలో సరైన భద్రతా చర్యలు, బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరాన్ని గుర్తు చేస్తాయి. ఈ ప్రమాదాలలో యువకుల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైనది.

సూర్య ప్రస్తుతం దర్శకుడు సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కంగువ' చిత్రంలో నటిస్తున్నారు. పీరియడ్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా లో యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ వంటి ప్రసిద్ధ పేర్లతో సహా ఆకట్టుకునే సమిష్టి తారాగణం ఉంది. ఈ క్రమంలోనే సూర్య నెక్స్ట్ మూవీ వాడి వాసల్ కోసం కూడా అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు, ఇది వెట్రి మారన్‌తో సూర్య నటించబోయే మొదటి చిత్రం. ఆ తర్వాత సూర్య తన తదుపరి చిత్రం కోసం మరోసారి సుధా కొంగర ప్రసాద్‌తో చేతులు కలపనున్నట్టు సమాచారం.


Tags

Read MoreRead Less
Next Story