Mullapudi Brahmanandam : ఉగాది పూట తెలుగు నిర్మాత మృతి

తెలుగువారి ప్రియమైన పండగ ఉగాది పూట తెలుగు సినిమా నిర్మాత మృతి చెందడం సినిమా పరిశ్రమలో విషాదాన్ని నింపింది. నిర్మించింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే చిత్రాలు ఆయన ఖతాలో ఉన్నాయి. ఆయనే ముళ్లపూడి బ్రహ్మానందం. 1999లో జగపతి బాబు, కౌసల్య, హీరా ప్రధాన పాత్రల్లో నటించిన అల్లుడుగారు వచ్చారు చిత్రంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు బ్రహ్మానందం. 2000 సంవత్సరంలో జగపతిబాబు, లయ జంటగా గుణశేఖర్ ఆయన నిర్మించిన మనోహరం చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు విజయాన్నీ అందుకుంది. ఈ చిత్రానికి ఏకంగా 4 నంది అవార్డులు రావడం విశేషం.
2002లో శ్రీకాంత్, రాజా, గజాలా, శృతిరాజ్ ప్రధాన పాత్రల్లో నిర్మించిన ఓ చిన్నదాన మంచి విజయం సాధించింది. ఈ మూవీతోనే రాజా నటుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. చివరగా 2004లో అల్లరి నరేష్ హీరోగా నేను అనే మూవీ నిర్మించారు. ఈ చిత్రం అంచనాలను అందుకోలేదు. అప్పటి నుంచి నిర్మాణానికి దూరంగానే ఉంటున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ముళ్లపూడి బ్రహ్మానందం (68 యేళ్లు) నిన్న (ఉగాది నాడు) కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు పరిశ్రమ పెద్దలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com