Mahendra : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత - ఎ. ఎ. ఆర్ట్స్ అధినేత మహేంద్ర (79) నిన్న రాత్రి (జూన్ 11) 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న మహేంద్ర... గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. వీరికి భార్య, కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కుమారుడ్ని కోల్పోయిన మహేంద్రకు... ప్రముఖ నిర్మాత - నటుడు మాదాల రవి అల్లుడు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసిన మహేంద్ర... ఎ. ఎ. ఆర్ట్స్ - గీతా ఆర్ట్ పిక్చర్స్ పతాకాలపై 36 చిత్రాలు నిర్మించారు. "పోలీస్" చిత్రంతో శ్రీహరిని హీరో చేసింది, హీరోయిన్ కాజల్ అగర్వాల్ పరిచయ చిత్రం "లక్ష్మీ కల్యాణం" నిర్మించింది ఈయనే. "ప్రేమించి పెళ్లి చేసుకో" చిత్రంతో నిర్మాతగా మారిన మహేంద్ర "పోలీస్, దేవా, కూలీ, ఒక్కడే, అమ్మ లేని పుట్టిల్లు, లక్ష్మీ కల్యాణం" తదితర చిత్రాలు నిర్మించారు. కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన "అర్జునా" వీరి చివరి చిత్రం. ఈ చిత్రం విడుదలవ్వకపోవడం ఆయనను ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా కుంగదీసింది. విలువలతో కూడిన సీనియర్ నిర్మాతల్లో ఒకరైన మహేంద్ర మరణం పట్ల పలువురు చిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. మహేంద్ర స్వస్థలం గుంటూరు. వారి అంత్యక్రియలు అక్కడే ఈ రోజు (జూన్ 12)న జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com