రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌  శుభాకాంక్షలు

తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్‌ . ఆరు దశాబ్దాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ప్రజలను మమేకం చేస్తూ మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన పోరాట క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, అధిగమించిన అడ్డంకులను గుర్తుకు తెచ్చుకున్నారు. శాంతియుత పద్దతిలో పోరాటాన్ని కొనసాగించి రాష్ట్రాన్ని సాధించిన మొత్తం ప్రక్రియను, దీనికి సహకరించిన వారందర్నీ కేసీఆర్‌ తలచుకున్నారు.

భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. తొమ్మిదేళ్లు నిలదొక్కుకున్న తీరు అద్భుతమని సీఎం కేసీఆర్ అన్నారు. నాడు వెనకబాటుకు గురైన తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోతోందని తెలిపారు. ‘తెలంగాణ మోడల్’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్న సీఎం.. తెలంగాణ వంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొనడం రాష్ట్ర ప్రజలు సాధించిన ఘన విజయమని పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమన్నారు. అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ మహోజ్వల స్థితికి చేరుకుంటున్న రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని 3 వారాల పాటు అంగరంగ వైభవంగా, పండుగ వాతావారణంలో జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఈ ఆనందకర సమయంలో సంతోషాలను పంచుకుంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములై సంబురాలను ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story