షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ మ్యాచ్లు : బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ

ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు కఠిన ఆంక్షల్ని ప్రకటించిన నేపథ్యంలో లీగ్ నిర్వహణపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన గంగూలీ ఐపీఎల్ నిర్వహణ యథాతథంగా జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఏప్రిల్ 10వ తేదీ నుంచి 25 వరకు ముంబయిలో 10 మ్యాచ్లు జరగాల్సి ఉంది. తొలి మ్యాచ్ ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్లు ముంబయిలోనే మకాం వేసి సాధన చేస్తున్నాయి.
మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు, మైదానం సిబ్బంది కరోనా బారినపడడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అక్షర్ పటేల్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రాణా వంటి ఆటగాళ్లు కరోనా బాధితుల జాబితాలో చేరారు. వీరిలో నితీశ్ రాణా కోలుకున్నారు. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఉద్ధృతస్థాయిలో నమోదవుతుండడం, ఐపీఎల్ లోనూ కరోనా కలకలం రేగడంతో ఈ పోటీల నిర్వహణపై అనుమాన మేఘాలు అలముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు.
ఈ సమస్యకు పరిష్కారం క్రికెటర్లందరికీ కరోనా వ్యాక్సిన్ ఇప్పించడమేనని అన్నారు. ఈ అంశంలో బీసీసీఐ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదించే అవకాశం ఉందని తెలిపారు. కరోనా వైరస్ ఎప్పుడు అంతరించిపోతుందో ఎవరికీ తెలియదని, దీనికి ప్రత్యేకంగా డెడ్ లైన్ అంటూ ఏమీ లేదని రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోవడమేనని, అందరిలాగే క్రికెటర్లకు కూడా వ్యాక్సిన్లు ఇప్పిస్తామని వివరించారు. టోర్నీ నిర్వహణపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com