Cricket: మరో కీలక సమరానికి టీమిండియా సై

Cricket: మరో కీలక సమరానికి టీమిండియా  సై
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇవాళ్టి నుంచి భారత్‌- ఆసీస్‌ మధ్య నాల్గో టెస్టు ప్రారంభం

మరో కీలక సమరానికి టీమిండియా సిద్ధం అయ్యింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇవాళ్టి నుంచి భారత్‌- ఆసీస్‌ మధ్య నాల్గో టెస్టు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లు భారత్‌ గెలవగా.. మూడో టెస్టులో ఆసీస్‌ గెలిచింది. టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా... సిరీస్‌లో నిర్ణయాత్మక నాల్గో టెస్ట్ మ్యాచ్ గెలిచి ట్రోఫి సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఉదయం 9.30 నిమిషాలకు అహ్మదాబాద్ వేదికగా టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ టీమిండియాకు కీలకం కానుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీనికితోడు సిరీస్ కైవసం చేసుకోచ్చు. దీంతో నాల్గో టెస్టులో విజయంపై టీమిండియా గురిపెట్టింది.

నాల్గో టెస్టులో టీమిండియాలో తుదిజట్టులో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. సిరాజుద్దీన్ స్థానంలో మహ్మద్ షమీ, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ స్థానంలో మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వస్తారని తెలుస్తోంది. మూడు టెస్టు మ్యాచ్‌లలో శ్రీకర్ భరత్ 8, 6, 23, 17, 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని పరుగులు రావట్టడంలో భరత్ విఫలమవుతున్నాడు. దీంతో నాల్గో టెస్టులో అతన్ని పక్కకుపెట్టి ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారన్న చర్చ జరుగుతుంది.

భరత్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చుననే వార్తల నేపథ్యంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. భరత్ ప్రదర్శనపై తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు. మూడో టెస్టులో భరత్ గొప్పగా రాణించనప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో అతడు చేసిన 17 పరుగులు మాత్రం చాలా కీలకం అని రాహుల్ చెప్పారు. భరత్ బ్యాటింగ్‌పై ఆందోళన లేదని, అతను మెరుగ్గా ఆడేలా మద్దతు ఇస్తామని రాహుల్ తెలిపారు. ఈనేపథ్యంలో భరత్ కు నాల్గో టెస్టు తుది జట్టులో అవకాశం దక్కుతుందా? లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే, భరత్ గత మూడు టెస్టుల్లో మైదానంలో పరుగులు రాబట్టలేక పోయినా.. కీపింగ్‌లో రాణిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story