HBD MS DHONI: ధోనీ 41వ బర్త్ డేకు స్పెషల్ గిఫ్ట్.. ట్విటర్లో ట్రెండింగ్..

మిస్టర్ కూల్గా టీమిండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తన 41వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకరు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ధోని.. 2020లో తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. దాదాపు 17 సంవత్సరాల కెరీర్లో ఎన్నో ప్రసంశలు పొందాడు. అయితే ధోనీకి గుర్తింపు మాత్రం తెలుగు నేలపైనే లభించింది. 2005లో విశాఖలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ధోని చేసిన మ్యాజిక్ ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. 123 బంతుల్లో 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 148 పరుగులను సాధించి పాక్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు ఎంఎస్. అప్పటి నుంచి టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, ఆ వెంటనే 2013 చాంపియన్స్ ట్రోఫీల్లో విజయాలు ధోనిని ప్రపంచంలోనే గొప్ప కెప్టెన్లలో ఒకడిగా నిలబెట్టాయి. కేవలం వన్డేల్లో మాత్రమే కాకుండా టెస్టుల్లో కూడా టీమిండియాను ధోని నంబర్ వన్ ర్యాంక్కు తీసుకెళ్లాడు.
ఇక ధోనీ పుట్టినరోజు వేడుకులను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మహేంద్రసింగ్ ధోనీకి బర్త్డే విషెస్ చెబుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఏపీలో అభిమానుల సందడి మాములుగా లేదు. విజయవాడలోని నందిగామ వద్ద 41 అడుగుల ధోనీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇందులో ధోని హెలికాప్టర్ షాట్ ఫొటోను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఓ అభిమాని ఈ కటౌట్ ఫోటోను నెట్టింట్లో పోస్ట్ చేయడంతో.. అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com