హైదరాబాద్ శివార్లలో మరో దారుణం.. ఘట్కేసర్లో విద్యార్ధినిపై మృగాళ్ల అత్యాచారయత్నం!
హైదరాబాద్ శివార్లలో మరో దారుణం జరిగింది. దిశను గుర్తుకు తెచ్చే ఘటన వెలుగుచూసింది. కాలేజీ బస్సు దిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిందో విద్యార్థిని. అంతే ఆటోలోని యువకులు ఆమెపై కన్నేశారు. దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా తీసుకెళ్లారు. కీడు శంకించిన ఆ యువతి వెంటనే తాను ఆపదలో ఉన్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె సమయ స్ఫూర్తికి తోడు పోలీసులు తక్షణమే స్పందించడంతో సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
స్థానికంగా ఓ కళాశాలలో బీ-పార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బుధవారం సాయంత్రం 6.15 గంటలకు రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగింది. ఆటో ఎక్కిన తర్వాత ఇంటికి వస్తున్నానంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆ ఆటోలో డ్రైవర్తో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. కొంతదూరం వెళ్లాక మహిళ దిగిపోయింది. ఆటోలో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి మరో ఇద్దరిని పిలిపించుకొని మార్గమధ్యలో ఆటోలో ఎక్కించాడు. ఆ విద్యార్థిని దిగాల్సిన స్టేజి వచ్చింది. ఆటోను ఆపాలని డ్రైవర్ను కోరగా ఆపకుండా ఘట్కేసర్ వైపునకు వేగంగా వెళ్లాడు.
భయాందోళనకు గురైన ఆ యువతి ఇంటికి ఫోన్ చేసి, తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది. వారు వెంటనే స్థానిక కౌన్సిలర్తో పాటు పలువురికి సమాచారాన్ని అందించారు. 100కు డయల్ చేశారు. సాయంత్రం 6.29 గంటలకు పోలీసులకు కాల్ వెళ్లింది. వెంటనే పోలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు విద్యార్థిని ఫోన్ సిగ్నల్స్ను వెంబడించాయి. అప్పటికే ఆటోలో యన్నంపేట వరకు వచ్చిన దుండగులు ఆమెను ఓ వ్యాన్లోకి మార్చారు.
ఈ క్రమంలో ఆమెపై దాడి చేసి, దుస్తులు చింపేశారు. విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించింది. పెనుగులాట కొనసాగుతుండగానే వ్యాన్లో ఘట్కేసర్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎటు చూసినా పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున సైరన్లతో తిరుగుతుండడంతో దుండగులు భయపడ్డారు. దాంతో యువతిని అవుటర్ రింగ్ రోడ్డు అన్నోజిగూడ పాయింట్ దగ్గర సర్వీసు రోడ్డు పొదల్లో విసిరేసి పారిపోయారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి పోలీసు వాహనం వచ్చింది.
పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న యువతిని చూసిన ఓ ఎస్సై వెంటనే ఆమెను భుజంపై వేసుకొని వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి 7.50 గంటలకు యువతిని పోలీసులు రక్షించారు. అంటే గంటా ఇరవై నిమిషాల్లో గాలింపు ఆపరేషన్ పూర్తిచేసి, ఆమెను కాపాడారు. పోలీసులు సత్వరం స్పందించడంతోనే తమ కుమార్తెకు ముప్పు తప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఆమెకు అండగా ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యకు సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com