ప్రేమ మోసానికి బలైన మైనర్ బాలిక.. గర్భవతిని చేసి ఆ పై గర్భనిరోధక మాత్రలు ఇచ్చి
Nalgonda Crime : ప్రేమించానన్నాడు. వెంటపట్టాడు. మాయమాటలు చెప్పాడు. ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఆ తర్వాత గర్భం తీయించుకోవాలని వేధించాడు. చివరికి గర్భనిరోధక మాత్రలు వికటించి మరణించింది. ఇది నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఓ కామాంధుని మోసానికి బలైన మైనర్ బాలిక ఉదంతం.
నకిరేకల్లోని శివాజీనగర్కు చెందిన మైనర్ బాలిక స్థానిక ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే నగరానికి చెందిన ఎర్పుల భాను అనే యువకుడు ప్రేమపేరుతో బాలికను లోబర్చుకున్నాడు. ఏడాది కాలంగా మాయమాటలు చెప్పి ఆరు నెలల గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భాను.. గర్భం తీయించుకోవాలని బాలికను వేధించాడు. కుటుంబసభ్యులకు తెలియకూడదని బాలికను గర్భ నిరోధక మాత్రలు ఇచ్చాడు. అయితే బాలిక పెద్ద మొత్తంలో మాత్రలు తీసుకోవడం, మందులు వికటించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
మైనర్ బాలిక మృతి కారణమైన యువడుడిని ఉరి తీయాలంటూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నకిరేకల్ ఇందిరా గాంధీ చౌక్ వద్ద రోడ్డుపై బాలిక మృతదేహం ఉంచి ధర్నా చేపట్టారు. బాధితుల నిరసనకు మహిళా సంఘాలు, గ్రామస్తులు మద్దతు పలికారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి మృతురాలి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com