Warangal : అప్పుడు ప్రేమించి పెళ్లి.. ఇప్పుడు కట్నం కోసం వేధింపులు..!

Warangal : నాలుగు సంవత్సరాలు వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కట్నం తీసుకువస్తేనే ఇంటికి రావాలని.. లేకపోతే వద్దు పో అంటున్నాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయినా భర్త మనసు మారలేదు. దీంతో అత్తింటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
అశోక్నగర్ గ్రామానికి చెందిన వినోద్ అదే గ్రామానికి చెందిన యువతిని వెంటపడి ప్రేమించి.. పెద్దలను ఒప్పించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే కాపురం చేశాడు. తర్వాత కట్నం తెస్తేనే ఇంటికి రావాలని వినోద్తో పాటు అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. పెద్దమనుషులు నచ్చెజెప్పే ప్రయత్నం చేసినా వినోద్ తీరు మారలేదు.
దీంతో విసుగు చెందిన బాధితురాలు గ్రామస్తులతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. అక్కడే వంటావార్పు మొదలెట్టారు. దీంతో భర్తతో సహా అత్తమామలు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బాధితురాలు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com