అమెజాన్‌ మేనేజర్‌ హత్య.. కాల్చి చంపిన దుండగులు

అమెజాన్‌ మేనేజర్‌ హత్య.. కాల్చి చంపిన దుండగులు
మంగళవారం అర్థరాత్రి ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

మంగళవారం అర్థరాత్రి ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన భజన్‌పురాలోని సుభాష్ విహార్ ప్రాంతంలో జరిగింది. హర్‌ప్రీత్ గిల్ మరియు అతని మామపై దుండగులు కాల్పులు జరిపారు.

హర్‌ప్రీత్ గిల్ తలపై దుండగులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో మృతి చెందారు. అతని మామ చికిత్స పొందుతున్నారు.

ఐదుగురు దుండగులు తనపై, అతని మేనల్లుడిపై కాల్పులు జరిపారని మృతుడి మామ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

సోమవారం, సెంట్రల్ ఢిల్లీలో గొడవల కారణంగా 22 ఏళ్ల వ్యక్తిని కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. రాత్రి 11.30 గంటల సమయంలో నగరంలోని సెంట్రల్‌ ప్రాంతంలోని పాత పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags

Next Story