అప్సర హత్యపై పూర్తి వివరాలు.. సాయికృష్ణ ఎలా చంపాడంటే..!

అప్సర హత్యపై పూర్తి వివరాలు.. సాయికృష్ణ ఎలా చంపాడంటే..!
X
ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చింది. విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను హతమార్చాడు.

అప్సర హత్యోదంతం సంచలనం సృష్టిస్తోంది. వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. అప్సర మర్డర్‌ కేసులో పూజారి వెంకట సాయికృష్ణను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడికి జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. అటు.. అప్సర మృతదేహానికి ఇవాళ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. ఆమె తండ్రి కాశీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఓ పూజారి క్రైం కథా చిత్రం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఆలయంలో పూజారి హంతకుడిగా మారాడు. భార్య, కూతురు ఉన్నా.. ఓ యువతితో పరిచయం పెంచుకుని.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చింది. విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను హతమార్చాడు. మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో వేసి పూడ్చేశాడు. ఆపై ఏమీ తెలియనట్టు... ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడే నిందితుడని గుర్తించి అరెస్ట్‌ చేశారు.


తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అయ్యగారి వెంకటసాయికృష్ణ కుటుంబం సరూర్‌నగర్‌ శ్రీవేంకటేశ్వర కాలనీలో ఉంటోంది. ఎంబీఏ పూర్తి చేసిన అతడు కాంట్రాక్టర్‌గా.. బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగానూ పనిచేస్తున్నాడు. 2010లో వివాహమైంది. భార్య, కూతురు ఉన్నారు. గతేడాది ఏప్రిల్‌లో చెన్నైకి చెందిన ఓ కుటుంబం ఇదే కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఆ కుటుంబ యజమాని కాశీలోని ఆలయంలో పనిచేస్తున్నారు. అతని భార్య ప్రైవేటు ఉద్యోగి. వారి కూతురు కురగంటి అప్సర.. చెన్నైలో ఉన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించింది. మోడలింగ్‌, సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌లో అవకాశాల కోసం అన్వేషణ ప్రారంభించింది.

రోజూ బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లేది. అక్కడ వెంకటసాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. అప్సర తల్లి అరుణని అతడు అక్కా అని పిలుస్తూ.. వారి ఇంటికి వెళ్లివస్తుండేవాడు. శంషాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పల్లిలో వెంకటసాయికృష్ణ నిర్వహిస్తున్న గోశాలకు అతనితోపాటు అప్సర పలుమార్లు వెళ్లింది. సినిమాల్లో అవకాశం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానంటూ.. అప్సరను లొంగదీసుకున్నాడు. అతడికి పెళ్లయిందని.. భార్య, కూతురు ఉన్నారని తెలిసినా ఆమె బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తననూ వివాహం చేసుకోమంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చిలో అప్సర గర్భం దాల్చడంతో ప్రైవేటు ఆసుపత్రిలో గర్భస్రావం చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ మరింత ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవలు జరిగేవి. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు.


ఈ నెల 3న కోయంబత్తూరు వెళ్దామని అప్సరను వెంకటసాయికృష్ణ నమ్మించాడు. విమాన టికెట్లు కొన్నానంటూ చెప్పాడు. నిజమేననుకున్న అప్సర లగేజీతో సహా ప్రయాణానికి సిద్ధమైంది. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని.. ఆమెను శంషాబాద్‌ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్‌ నుంచి బయల్దేరారు. రాత్రి 10 గంటలకు శంషాబాద్‌ మండలం రాళ్లగూడలోని ఒక హోటల్‌లో భోజనం చేశారు. రాత్రి 11 గంటలకు సుల్తాన్‌పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపారు.

గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులోకి చేర్చాడు. 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్‌ వద్దకు చేరారు. ఆమె నిద్రలోకి జారుకోగానే కారు సీటు కవర్‌ను ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో అప్సర ప్రాణాలు కోల్పోయింది. మృతదేహంపై కారు కవర్‌ కప్పి.. అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకున్న వెంకటసాయికృష్ణ.. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.


కోయంబత్తూరు వెళ్తానన్న అప్సర ఫోన్‌ ఎత్తకపోవడంతో వెంకటసాయికృష్ణను ఆమె గురించి తల్లి అరుణ వాకబు చేశారు. శంషాబాద్‌ చేరాక ఆమె మనసు మార్చుకొని మిత్రులతో కలసి భద్రాచలం వెళ్లిందంటూ చెప్పాడు. అప్సర అదృశ్యమైనట్లు వారిద్దరూ ఈ నెల 5న శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని ఈ నెల 7న కవర్‌లో చుట్టి సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్‌ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు.

పోలీసుల ఎదుట వెంకటసాయికృష్ణ తనకేమీ తెలియదన్నట్టుగా నటించాడు. అప్సర తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని చెప్పాడు. ఆమె బస్సు ఎక్కినట్లు అతడు చెప్పిన శంషాబాద్‌లోని అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించినపుడు అసలు విషయం వెలుగుచూసింది. ఆమె బస్సు ఎక్కలేదని తేలింది. ఇద్దరూ కలిసి కారులో సుల్తాన్‌పల్లి వెళ్లినట్లు గుర్తించారు. అప్సర భద్రాచలం వెళ్లిందని చెప్పిన సమయంలో ఇద్దరి సెల్‌ఫోన్లు ఒకేచోట ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో వాస్తవం వెలుగుచూసింది.

పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తేవడం, వివాహేతర సంబంధం విషయం బయటపడితే పరువు పోతుందనే భయంతోనే అప్సరను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని డీసీపీ తెలిపారు. అతడిని కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం సేకరిస్తామన్నారు. సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ సమక్షంలో పంచనామా చేసి.. అప్సర మృతదేహాన్ని జేసీబీ సాయంతో వెలికితీశారు. శవపరీక్ష కోసం ఉస్మానియా శవాగారానికి తరలించారు. తన బిడ్డను మాయమాటలతో మోసగించిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని అప్సర తల్లి అరుణ అన్నారు. అతడు తనను అక్కా అని పిలుస్తుండేవాడని.. ఇంటికి వచ్చి భోజనం చేసేవాడని, స్నేహంగా మెలిగేవాడని తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగడతాడని కలలోనూ అనుకోలేదని రోదించారు.

Tags

Next Story