రాంగ్ డైరెక్షన్ లో డ్రైవింగ్.. పాల విక్రేత మృతికి కారణమైన 17 ఏళ్ల యువకుడు..

ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన విషాద సంఘటనలో నవీన్ వైష్ణవ్ అనే 24 ఏళ్ల యువకుడు మరణించాడు. 17 ఏళ్ల బాలుడు వేగంగా నడుపుతున్న ఎస్యూవీ పాలు పంచుతున్న యువకుడిని ఢీకొట్టింది. దాంతో వైష్ణవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో మహీంద్రా స్కార్పియో రాంగ్ సైడ్ నుంచి వస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో పాలు పంచుతున్న బాధితుడు నవీన్ వైష్ణవ్ మృతి చెందాడని పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వైష్ణవ్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటన తర్వాత యువకుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. అధికారులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. SUV యజమాని ఇక్బాల్ జివానీ, వైష్ణవ్ మృతికి కారణమైన మహ్మద్ ఫాజ్ ఇక్బాల్ జివానీని పోలీసులు అరెస్టు చేశారు. వాహనాన్ని సీజ్ చేసి ఆధారాలు సేకరించేందుకు సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించారు.
ప్రమాద సమయంలో టీనేజ్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అదనంగా, విషాద సంఘటనకు ముందు నిందితుడు స్నేహితులతో కలిసి పార్టీకి హాజరై ఉంటాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనే పూణేలో చోటు చేసుకుంది. అక్కడ కూడా 17 ఏళ్ల వ్యక్తి మత్తులో పోర్స్చే నడుపుతూ ఘోరమైన ప్రమాదానికి కారణమయ్యాడు, ఇది ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com