Student Suicide : విద్యార్ధిని ప్రాణం తీసిన బ్యాంక్ రికవరీ ఏజెంట్లు..

Student Suicide : ఎన్టీఆర్ జిల్లాలో కొందరు బ్యాంక్ రికవరీ ఏజెంట్ల అరాచకానికి విద్యార్థిని బలైంది. నోటికొచ్చినట్లు మాట్లాడటంతో మనస్తాపానికి గురై జాస్తి హరితవర్షిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నందిగామ రైతుపేటలో చోటుచేసుకుంది. తండ్రి చేసిన అప్పు చెల్లించాలంటూ కొందరు బ్యాంకు రికవరీ ఏజెంట్లు వచ్చారని.. ఏదో సర్దిచెప్పి పంపించినట్లు ఆమె తల్లి తెలిపింది. మళ్లీ ఇంకొందరు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడారని.. చదువు మానేసి పశువులు కాసుకోమంటూ తిట్టారని కన్నీటిపర్యంతమైంది. ఆ మాటలు విన్న తన కూతురు మనస్తాపానికి గురైందని.. రికవరీ ఏజెంట్లే ప్రాణం తీశారని ఆరోపించింది.
ఈ క్రమంలో హరితవర్షిని రాసిన సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. మా వల్ల నీ ఆరోగ్యం పాడుచేసుకోవద్దమ్మా.. చెల్లిని బాగా చదివించాలని పేర్కొంది. నీకు భారం అవ్వొద్దనే ఇలా చేశానని.. ఐయామ్ సారీ అమ్మా అని పేర్కొంది. నన్ను ఇప్పుడు చదివించే పరిస్థితిలో కూడా లేమని.. స్కాలర్షిప్తో చెల్లిని చదివించాలని సూసైడ్ లెటర్లో రాసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com