ఇదేం మోసం రా బాబు.. భార్యని చెల్లి అని చెప్పి..

కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడు. మరేం దొరకనట్టు భార్యని చెల్లి అని చెప్పి మరొకడికి కట్టబెట్టాడు. పెళ్లైన మూడో రోజే నగలతో ఉడాయించేసరికి అసలు విషయం బయటపడింది. ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. కోట జిల్లా కునాడిలో నివసించే రవి అనే యువకుడు పెళ్లి చేసుకోవడానికి మ్యారేజ్ బ్రోకర్ దేవరాజ్ సుమన్ని సంప్రదించాడు.
సుమన్ అతడికి కొన్ని ఫోటోలు చూపించాడు. అందులో కోమల్ అనే యువతి నచ్చడంతో ఆమె వివరాలు కనుక్కోమన్నాడు రవి. కోమల్కు తల్లిదండ్రులు లేరని అన్నయ్య ఒక్కడే ఉన్నాడని మ్యారేజ్ బ్రోకర్ చెప్పాడు. సరే ఆమెనే పెళ్లి చేసుకుంటానని రవి అన్నాడు. యువతి అన్నయ్యను కలిసి అన్ని వివరాలు మాట్లాడతానన్నాడు. కోమల్ వాళ్ల అన్నయ్య సోనూ కార్పరే, సుమన్, రవి ఓ హోటల్లో కలిశారు. తాము కట్నం ఇచ్చుకోలేమని కోమల్ వాళ్ల అన్నయ్య ముందే చెప్పుకొచ్చాడు. తక్కువ సమయంలో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో కోమల్, రవిల పెళ్లి జరిపించాడు సోనూ కార్పరే. అనంతరం కోమల్ భర్తతో కాపురానికి వెళ్లింది.
పెళ్లైన మూడో రోజుకే ఆమె కనిపించకుండా పోయింది. ఇంట్లో ఉన్న నగదు, బంగారం కూడా లేకపోవడంతో రవి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి సంబంధం చూసిన మ్యారేజ్ బ్రోకర్ సుమన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇండోర్కు చెందిన సోనూ కార్పరే, కోమల్ భార్యా భర్తలని ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గం ఎంచుకున్నారని చెప్పాడు. తనకు కూడా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో ఈ సంబంధం కుదిర్చానని చెప్పాడు. సుమన్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సోనూకార్పోరేను, కోమల్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com