Hyderabad : నిత్య పెళ్లికొడుకు.. నకిలీ పేస్లిప్పులతో మహిళలకు వల..
![Hyderabad : నిత్య పెళ్లికొడుకు.. నకిలీ పేస్లిప్పులతో మహిళలకు వల.. Hyderabad : నిత్య పెళ్లికొడుకు.. నకిలీ పేస్లిప్పులతో మహిళలకు వల..](https://www.tv5news.in/h-upload/2022/07/14/752105-hyderabad-man-marries-7-tim.webp)
Hyderabad : ఏడు పెళ్లిళ్లు.. ఒకే కాలనీలో మూడు వీధుల్లో ముగ్గురు భార్యలు.. విడాకులు తీసుకుని, ఉద్యోగం చేస్తూ, బాగా చదువుకున్న మహిళలే అతని టార్గెట్. నకిలీ విడాకుల పత్రాలు, పే స్లిప్లతో మోసం చేయడం అతగాడి టాలెంట్. లక్షల్లో డబ్బులు వసూలు, మరో మహిళతో పరారవ్వడం అతనికి నిత్యకృత్యం. ఇదీ నిత్య పెళ్లికొడుకు అడపా శివ శంకర్ ట్రాక్ రికార్డ్. భార్యకు విడాకులు ఇవ్వకుండానే నకిలీ విడాకుల పత్రాలు సృష్టించి.. వరుసగా పెళ్లిళ్లు చేసుకున్నారు శివ.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడపా శివ శంకర్ బాబు ఇంజనీరింగ్ చదివాడు. మ్యాట్రిమోనీ సైట్లో రెండో పెళ్లి కోసం పేరు నమోదు చేసుకున్న ఉన్నత విద్యావంతులు, ఉద్యోగం చేస్తున్న మహిళలను టార్గెట్గా పెట్టుకున్న శివ.. తనకు వివాహం అయి విడాకులు తీసుకున్నానని, ఫేక్ డైవర్స్ పేపర్స్ చూపించి వారిని నమ్మించేవాడు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగముందని.. దాదాపు రెండు లక్షల దాకా జీతం వస్తుందని ప్లే సిప్స్ చూపించి వారిని పెళ్లి చేసుకునే వాడు. ఇలా వరుసగా ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
పెళ్లి అయిన తర్వాత నుంచి శివ గేమ్ ప్లేన్ మొదలు పెడతాడు.. ప్రాజెక్టు పని మీద అమెరికా పంపుతున్నారని.. ఇద్దరం వెళ్దామని చెప్పి అత్తారింటి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. ఆ తర్వాత ప్రయాణం వాయిదా పడిందని నాటకాలు మొదలు పెడతాడు. ఇచ్చిన డబ్బులు అడిగితే రేపు మాపు అంటూ రోజులు గడిపేస్తాడు.
ఈ క్రమంలో అనుమానం వచ్చిన ఓ మహిళ మెదక్ జిల్లా రామచంద్రాపురం పీఎస్లో ఆశ్రయించగా.. శివ మరో మహిళతో పీఎస్కు వచ్చాడు. ఆమె తన భార్య అని.. డబ్బు ఇచ్చే భరోసా తమదేనంటూ ఆమెనే మధ్యవర్తిగా ఉంచాడు. ఆ తర్వాత ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంతో.. అసలు విషయం బయటపడింది. శివపై నిఘా పెట్టగా.. ఒకే కాలనీలో మూడు వీధుల్లో ముగ్గురితో సహజీవనం చేస్తునట్లు తెలిసింది. ఇదేంటని అతడిని నిలదీస్తే.. మరో మహిళతో శివ పరారయ్యాడు.
శివ తమతో కలిసి మొత్తం ఏడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు బాధిత మహిళలు చెబుతున్నారు. తొలి వివాహం వారి గ్రామంలోనే 2018లో జరగ్గా, తర్వాత నెలల వ్యవధిలో ఒక్కో మహిళను వివాహం చేసుకుంటూ వెళ్లాడు. చివరిగా గత ఏప్రిల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్లి పరారీలో ఉన్నాడు. అతడి మోసాలపై కేపీహెచ్బీ పీఎస్లో 2019లో ఒకరు, 2021లో మరొకరు, ఆర్సీ పురం, గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్, అనంతపురం పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా మహిళలు ఫిర్యాదులు ఇచ్చారు.
ఇందులో ట్విస్టులు ఏంటంటే.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు తమకు దగ్గర బంధువని.. బీజేపీ నేత శ్రీకాంత్ సన్నిహితుడని శివ చెపుతూ ఉండేవాడని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com