కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

ఓ అబద్ధం నిండు ప్రాణం పోయేలా చేసింది. ఘట్కేసర్లో కిడ్నాప్ నాటకమాడిన 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. కిడ్నాప్ నాటకం వెలుగు చూసిన తర్వాత యువతి ఘట్ కేసర్లోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. బుధవారం ఉదయం నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురు వ్యక్తులు తనను అపహరించి, సామూహిక అత్యాచారం చేశారంటూ కీసరకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు మూడు రోజుల తర్వాత అదంతా కట్టుకథ అని తేల్చారు. తొలుత బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా సామూహిక అత్యాచారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించాక అత్యాచారం జరగలేదనే నిర్ధారణకు వచ్చారు. ఇల్లు వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాల్లో తిరిగానని, ఆ సమయంలో తల్లి భయపెట్టడంతో అత్యాచారం అనే నాటకాన్ని ఆడినట్లు బాధితురాలు అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు. ఇందుకు విద్యార్థిని చేసిన ప్రయత్నాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
తమ కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారంటూ ఫార్మసీ విద్యార్థిని బంధువులు డయల్ 100కు ఫోన్ చేశారు. పోలీసులు రాత్రి 7.40 గంటల ప్రాంతంలో అన్నోజీగూడ రైల్వేగేట్కు కాస్త దూరంలో పొదల్లో అర్ధనగ్నంగా ఉన్న యువతిని గుర్తించారు. కాలికి గాయాలై నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడంతో ఇబ్బందిపెట్టకుండా సీన్ రీ-కన్స్ట్రక్షన్కు దర్యాప్తు బృందం ఏర్పాట్లు చేసుకుంది. ఈ క్రమంలో కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్ ఆ సమయంలో ఘటనా స్థలంలో లేడని సెల్ఫోన్ సిగ్నళ్ల ద్వారా బృందంలోని ఓ సీఐ తెలుసుకున్నారు. అప్పటికే అదుపులో ఉన్న అతన్ని మరోసారి సీఐ ప్రశ్నించారు. విద్యార్థిని ఆర్ఎల్ నగర్లో దిగలేదని, వేరే స్టాప్లో దిగిందని అతను చెప్పాడు. ఆటో సవారీ పూర్తయ్యాక సినిమాకు వెళ్లి తర్వాత మద్యంతాగి ఇంటికెళ్లినట్టు వివరించాడు. అతను చెప్పిన వివరాలన్నీ నిజమేనని నిర్ధారణకు వచ్చాక దర్యాప్తు అధికారులు రివర్స్ ఇన్వెస్టిగేషన్ను ప్రయోగించారు. అన్నోజిగూడలో యువతిని రక్షించిన స్థలం నుంచి ఆమె ఇంటి బస్స్టాప్ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల మధ్యకాలంలో హెరిటేజ్ బస్స్టాప్, యంనంపేట గ్రామం, శ్రీనిధి కళాశాల, ఘట్కేసర్ ప్రధాన రహదారి, ఎన్టీపీసీ క్రాస్రోడ్స్ అన్నోజిగూడ గ్రామాల్లో ఆమె ఒంటరిగానే నడిచినట్లు గుర్తించారు.
కిడ్నాప్, రేప్ అబద్ధమని నిరూపించేందుకు కావాల్సిన ఫుటేజీలు, ఇతర సాక్ష్యాధారాలను మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి సేకరించారు. వాటితో షార్ట్ ఫిల్మ్ తయారుచేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని వద్దకు వెళ్లారు. షార్ట్ ఫిల్మ్ను చూపించి.. మీపై ఎవరు అత్యాచారం చేశారంటూ డీసీపీ ప్రశ్నించారు. దీంతో.. ఆ యువతి.. తాను చెప్పిందంతా అబద్ధమని అంగీకరించింది. ఈ వ్యవహారంలో ఆటో డ్రైవర్లకు ఎలాంటి సంబంధంలేదన్న సీపీ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని అప్పట్లో ఆటోడ్రైవర్లను కోరారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అపహరణ నాటకం ఆడడం వెనుక ప్రధాన కారణం కిడ్నాప్ కథలంటే యువతికి ఉన్న ఇష్టమేనని సీపీ తెలిపారు. ఆరు నెలల క్రితం ఓ స్నేహితురాలికి తన తమ్ముణ్ని ఆస్తి కోసం ఎవరో అపహరించారని ఆమె అబద్ధం చెప్పిందని, పలుమార్లు పలువురికి ఇలా చెప్పినట్టు తెలుసుకున్నామన్నారు. మొత్తానికి ఓ అబద్ధం నలుగురు ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. రాష్ట్రంలో ఓ ఉత్కంఠ పరిస్థితిని తీసుకువచ్చింది. చివరికి ఆ యువతి ఆత్మహత్యకు కారణమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com