మ్యాట్రి'మనీ' లేడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అకౌంట్లో డబ్బులు..!
పెళ్లి పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న మాయ లేడీని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్ వేర్ సాయంతో గొంతు మార్చి ఎన్ఆర్ఐల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైళ్లు క్రియేట్ చేసినట్లు తేలింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అకౌంట్లో డబ్బులు ట్రాన్ఫర్ చేయించుకొని.. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది. ఈ క్రమంలో పలువురు బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం రంగనాయకులపేటకు చెందిన స్వాతి.. ఎస్వీ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. అధ్యాపకుడిగా పనిచేసే కోరం దుర్గాప్రవీణ్ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఘట్కేసర్ దగ్గర పోచారంలో నివాసముంటోంది. అయితే విలాసవంతమైన జీవితానికి అలవాటై మోసాలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలువురు యువకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది.
గతేడాది పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై విడుదలైంది. అయినా ఆమె ప్రవర్తనలో మార్పురాలేదు. మరోసారి ఎన్ఆర్ఐలకు వల వేసి పెళ్లి పేరుతో డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా మరికొందరిని ఇలాగే మోసం చేయడంతో.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో ఆమె ఆటకట్టించారు. ఘట్కేసర్లో అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com