ముస్లిం యువతితో డిన్నర్ కు వెళ్లినందుకు దాడి

ముస్లిం యువతితో డిన్నర్ కు వెళ్లినందుకు దాడి
X


ఓ ముస్లిం యువతితో డిన్నర్ కు వెళ్లినందుకు హిందూ యువకుడిపై దాడిచేశారు. ఈ జంటను రక్షించడానికి వెళ్లిన ఇద్దరు స్థానికులపై కత్తులతో దాడి చేశారు దుండగులు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో గురువారం రాత్రి జరిగింది. యువ జంట ఒక హోటల్ నుంచి బయటకు వచ్చినపుడు ఓ గుంపు వారిపై వాగ్వాదానికి దిగారు. తమ మతానికి చెందిన యువతితో డిన్నర్ కు ఎలా వెళ్తావంటూ యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు. వేరే మతానికి చెందిన వ్యక్తితో డిన్నర్ కు ఎలా వెళ్తావంటూ యువతితో గొడవకు దిగారు.


తల్లిదండ్రులకు చెప్పే తాను డిన్నర్ కు వెళ్లినట్లు యువతి చెప్పినా వినిపించుకోలేదు దుండగులు. అక్కడే ఉన్న స్థానికులు జంటను రక్షించడానికి ప్రయత్నించారు. అయితే దుండగుల గుంపులోని కొందరు జంటను రక్షిస్తున్న స్థానికులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

యువతి, యువకుడు భోజనం చేసి హోటల్ బయటకు వచ్చినప్పుడు ఓ గుంపు వారి స్కూటీని వెంబడించింది. వేరే మతానికి చెందిన యువకుడితో ఎందుకు భోజనానికి వెళ్లావంటూ మహిళను బెదిరించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ రఘువంశీ తెలిపారు. "తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తాను ఆ వ్యక్తితో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చానని మహిళ చెప్పింది. వారి ప్రవర్తనపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతలో, జంటను రక్షించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు గుంపు నుండి ఎవరో కత్తితో పొడిచడంతో గాయపడ్డారు. ," అని అదనపు DCP తెలిపారు.

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశామని, ఇప్పటివరకు ఏడుగురు నిందితులను గుర్తించామని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కమలేష్ శర్మ తెలిపారు.
23-26 ఏళ్ల మధ్య ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మిగిలిన 20 మంది వ్యక్తులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శర్మ తెలిపారు. జంటను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు.

Tags

Next Story