Hyderabad Drugs: పోలీసుల నిఘా తప్పించుకుని డ్రగ్స్ సరఫరా.. అసలు ఇది ఎలా సాధ్యం..?

Hyderabad Drugs: పోలీసుల నిఘా తప్పించుకుని డ్రగ్స్ సరఫరా.. అసలు ఇది ఎలా సాధ్యం..?
Hyderabad Drugs: అతిగా డ్రగ్స్ తీసుకుని యువకుడు చనిపోయిన కేసు హైదరాబాద్‌లో నమోదైంది.

Hyderabad Drugs: అసలు హైదరాబాద్‌కి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి.. ఎంత నిఘా పెట్టినా పెడ్లర్లు కొత్త కొత్త మార్గాల్లో ఎలా వీటిని సరఫరా చేస్తున్నారు..! ఇదిప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌, బంబాజాహిల్స్‌తోపాటు గచ్చిబౌలి ప్రాంతాల్లోని VIP జోన్లన్నీ డ్రగ్స్ అడ్డాలుగా మారాయనే మాట వినిపిస్తోంది. అటు, కాలేజీ విద్యార్థులు కూడా డ్రగ్స్‌కి బానిసలై.. వాళ్లే గోవా లాంటి చోట్ల నుంచి డ్రగ్స్‌ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారనే విషయం కూడా తాజాగా వెలుగు చూసింది.

అతిగా డ్రగ్స్ తీసుకుని యువకుడు చనిపోయిన కేసు హైదరాబాద్‌లో నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థి గోవాకి వెళ్లి డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అతిగా డ్రగ్స్ తీసుకోవటంతో కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. అతడి పరిస్థితిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. పది రోజులుగా హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు. దీంతో హైదరాబాద్‌ లో డ్రగ్స్ కారణంగా మరణించిన తొలి కేసుగా ఇది నిలిచింది.

మరణించిన వ్యక్తి గోవాలో మల్టిపుల్ డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. తెలంగాణలో సగటున వారానికో డ్రగ్స్‌ కేసైనా నమోదు అవుతోంది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ సాయంతో వీటి కట్టడికి ఎంత ప్రయత్నం చేస్తున్నా.. ఆ గ్యాంగ్‌లు కూడా రకరకాల నిక్‌నేమ్స్‌తో డ్రగ్స్‌ను దర్జాగా అమ్మేస్తోంది. కోడ్‌ భాషలు, సాధారణ ఫోన్‌లు కాకుండా శాటిలైట్‌ ఫోన్‌లతోనూ కొందరు దందా చేస్తున్నారు.

హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ -'హెచ్‌ న్యూ' ఇలాంటి వాటిపై నిఘాను మరింత పెంచింది. డ్రగ్స్‌, గంజాయిపై యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఓ వైపు కార్యక్రమాలు చేపడుతూనే.. డ్రగ్స్ ముఠాతో లింకులున్న వారి అందరినీ వెంటాడి పట్టుకుంటోంది. హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ వినియోగం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ డ్రగ్స్‌ ఆదిలాబాద్, విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి సరఫరా అవుతున్నాయి.

రాష్ట్రంలోని వరంగల్, మెదక్, జహీరాబాద్‌లతోపాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి గంజాయి, హష్‌ ఆయిల్‌ వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక విదేశాల నుంచి కూడా వివిధ రూపాల్లో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ జరుగుతోంది. ముంబై, గోవా, ఢిల్లీ, చండీగఢ్‌ తదితర చోట్ల డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారి డ్రగ్‌ నెట్‌వర్క్‌లో నైజీరియన్లు, ఇతర ఆఫ్రికా దేశాల వారిని వినియోగిస్తున్నారు.

వీరు డ్రగ్స్‌ను రవాణా చేసి, తీసుకున్న డబ్బును డీలర్లకు పంపి.. వారిచ్చే కమీషన్‌ తీసుకుంటారు. నైజీరియన్లు పట్టుబడినా తమకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా డీలర్లు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఈమధ్య డ్రగ్స్‌ బానిసలైన యువకులే డ్రగ్స్‌ విక్రయించే పెడ్లర్లుగా మారుతున్నారు. కొందరు నేరుగా డార్క్‌నెట్‌ నుంచి డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story