Jubliee Hills Gangrape Case : ఆ నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు..

Jubliee Hills Gangrape Case : సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టుతో పాటు జువైనల్ జస్టిస్ బోర్డులో వేర్వేరుగా చార్జ్షీట్లు దాఖలు చేసిన పోలీసులు.. 65 మందిని సాక్షులుగా చేర్చారు. 350 పేజీలతో ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరిచారు. మే 28న జూబ్లీహిల్స్లోని అమ్నేషియా పబ్కు వచ్చిన బాలికను మభ్యపెట్టి సాదుద్దీన్తో పాటు ఐదుగురు మైనర్లు వాహనంలో బేకరికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
ఆ తర్వాత సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇన్నోవా కారులో గ్యాంగ్ రేప్కు పాల్పడినట్లు వివరించారు. ఆ తర్వాత బాలికను పబ్ వద్ద వదిలిపెట్టగా.. బాలిక అక్కడి నుంచి తన తండ్రిని పిలిపించుకొని ఇంటికి వెళ్లిందన్నారు. ఆమె మెడపై గాయాలు గమనించిన తల్లి ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడిందని.. మే 31వ తేదీన మైనర్ బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.
జూన్ 1న బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించామని.. అక్కడి నుంచి నీలోఫర్ ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. రిపోర్టులో అత్యాచారం జరిగినట్లు నివేదిక వచ్చిందన్నారు. బాధితురాలు చెప్పిన వివరాలతో పాటు.. సాంకేతికతను ఉపయోగించుకొని పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని చార్జ్షీట్లో పేర్కొన్నారు.
ఐదుగురు మైనర్లతో పాటు.. సాదుద్దీన్ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారని.. ఉస్మానియా ఆస్పత్రిలో లైంగిక సామర్థ్య పరీక్షలను చేయించామని.. నిందితులు ఉపయోగించిన వాహనంలో క్లూస్ టీం అధికారులు పలు నమూనాలు సేకరించిందన్నారు. బాధితురాలి వస్త్రాలను సేకరించి.. నిందితుల డీఎన్ఏ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామన్నారు.
నిందితుల డీఎన్ఏ.. ఇన్నోవా కారులోని నమూనాలతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ అధికారులు నివేదిక ఇచ్చారన్నారు. అత్యాచారం జరిగిన సమయంలో ఆరుగురు నిందితుల సెల్ఫోన్ సిగ్నల్స్ జూబ్లీహిల్స్లోనే ఉన్నాయన్నారు.ఐదుగురు మైనర్లు తాము చేస్తున్నది నేరమని తెలిసినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులు చార్జ్షీట్లో పేర్కొన్నారు.
ఇలాంటి సందర్భాల్లో మైనర్లను సైతం మేజర్లుగా పరిగణిస్తూ వెలువడిన కోర్టుల తీర్పులను జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డుకు సమర్పించిన చార్జ్షీట్లో పొందుపర్చారు. ఈ కేసులోనూ ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ విచారణ చేయాలని కోరారు. అయితే.. ఐదుగురు మైనర్లు బెయిల్పై ఇటీవల విడుదలయ్యారు. సాదుద్దీన్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com