Crime: ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం స్నేహితుడి హత్య

Crime: ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం స్నేహితుడి హత్య
పంజాబ్‌లో దారుణం... ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం స్నేహితుడి హత్య... పోలీసులు తీగ లాగితే కదిలిన డొంక...

డబ్బు ఎవరితో ఎలాంటి పనైనా చేయిస్తుంది అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం తన స్నేహితుడినే ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. పంజాబ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. పంజాబ్‌కు రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తికి వ్యాపారంలో తీవ్ర నష్టాలు వచ్చాయి. ఇందులోంచి బయటపడేందుకు అతను ఓ కన్నింగ్‌ ప్లాన్‌ వేశాడు. తనలా ఉన్న వ్యక్తిని హత్య చేసి... తానే చనిపోయానని ఇన్సూరెన్స్‌ కంపెనీని నమ్మించి నాలుగు కోట్ల రూపాయలు కొట్టేయాలని ప్లాన్‌ చేశాడు. ఈ ప్లాన్‌ను భార్య, మరికొందరు స్నేహితులకు చెప్పాడు. వారంతా ఈ కుట్రలో చేతులు కలిపారు.


సైన్‌పూర్ ప్రాంతానికి చెందిన సుఖ్‌జీత్‌ అనే వ్యక్తితో గురుప్రీత్ సింగ్ స్నేహం నటించాడు. జూన్‌19న గుర్‌ప్రీత్... సుఖ్‌జీత్‌కు మద్యం తాగించాడు. అతను స్పృహతప్పి పడిపోగానే గురుప్రీత్‌ బట్టలు అతడికి వేసి రోడ్డుపై పడేశారు. అనంతరం భార్య ఖుష్‌దీప్ కౌర్ సహా మరో నలుగురితో కలిసి ట్రక్కుతో తొక్కించి అతడిని హత్య చేశారు. ప్రమాదంలో మరణించింది తన భర్త గురుప్రీతే అని అతని భార్య గుర్తించింది. అనంతరం తన భర్త గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని.. అతడి పేరుపై ఉన్న నాలుగు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌కు దరఖాస్తు చేసింది. ఇక్కడే వారు ఊహించని ఘటన జరిగింది.


తన భర్త కనిపించడం లేదని సుఖ్‌జీత్‌ భార్య జూన్ 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడ తీగ లాగితే మొత్తం డొంక కదిలింది. గురుప్రీత్ వేసిన కుట్ర బహిర్గతమైంది. తన భర్త సుఖ్‌జీత్‌కు గురుప్రీత్‌ ఇటీవల ఎక్కువగా మద్యం తాగిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. అనుమానం వచ్చిన పోలీసులు గురుప్రీత్ కుటుంబీకులను మళ్లీ విచారించారు. గురుప్రీత్ బతికే ఉన్నాడని, రూ. 4 కోట్ల విలువైన బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు అతని భార్య, ఇతరులతో కలిసి అతని మరణాన్ని నకిలీ చేసేందుకు కుట్ర పన్నాడని ఎస్పీ రవ్‌జోత్ కౌర్ గ్రేవాల్ తెలిపారు. ఈకేసులో గురుప్రీత్‌ సహా అతని భార్య, నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story