Rajasthan Crime: ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకోమన్నందుకు హత్య..

ఆమె తన ప్రేమికుడిని కలుసుకునేందుకు 600 కి.మీ.లు కారులో వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. మరుసటి రోజు ఆమె కారులోనే శవమయ్యింది. ప్రేమికుడే హంతకుడయ్యాడు. ఆమె ప్రేమికుడు ఆమెను ఇనుప రాడ్తో హత్య చేసినందుకు అరెస్టు చేయబడ్డాడు.
రాజస్థాన్లోని ఝుంఝునులో అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తున్న ముఖేష్ కుమారి పదేళ్ల క్రితం తన భర్త నుండి విడిపోయింది. గత సంవత్సరం అక్టోబర్లో, ఆమె బార్మర్లోని పాఠశాల ఉపాధ్యాయుడు మనారామ్తో ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యింది. ఇద్దరూ తరచుగా కలుసుకోవడం ప్రారంభించారు. ముఖేష్ తరచుగా మనారామ్ను కలవడానికి ఝుంఝును నుండి బార్మర్కు - దాదాపు 600 కి.మీ. ప్రయాణించి అతడిని చేరుకునేది.
ఆమె అతనితో స్థిరపడాలని కోరుకుంది. ముఖేష్ తన భర్తకు విడాకులు ఇచ్చినప్పటికీ, మనారామ్ విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. పోలీసుల ప్రకారం, ముఖేష్ వివాహం చేసుకోమని మనారామ్ పై ఒత్తిడి తెచ్చేది. దీంతో ఇద్దరి మద్యా గొడవలు మొదలయ్యాయి.
సెప్టెంబర్ 10న, ముఖేష్ తన ఆల్టో కారులో మనారామ్ గ్రామానికి చేరుకుంది. ఆమె అక్కడ ఉన్నవారిని అడిగి మనారామ్ ఇంటికి చేరుకుని, అతని కుటుంబ సభ్యులకు తమ సంబంధం గురించి చెప్పింది. ఇది మనారామ్కు కోపం తెప్పించింది. ఇద్దరూ వాదులాడుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఆ తర్వాత మనారామ్ ముఖేష్ తో మాట్లాడుకుందామని చెప్పాడు. సాయంత్రం ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించి ముఖేష్ తలపై ఇనుప రాడ్ తో కొట్టి చంపేశాడు మనారామ్. ముఖేష్ మృతదేహాన్ని ఆమె కారు డ్రైవింగ్ సీటులో ఉంచి, దానిని రోడ్డు పక్కన పడవేసి ప్రమాదంగా చిత్రీకరించాడు. అతను తన గదికి తిరిగి వచ్చి నిద్రపోయాడు.
పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించగా, ఆమె మరణించిన సమయంలో మనారామ్ మరియు ముఖేష్ ఫోన్ లొకేషన్లు ఒకేలా ఉన్నాయని తేలింది. మనారామ్ ని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com