Sai Priya Missing Case : నాలుగు రోజుల ముందు అదృశ్యమైన సాయి ప్రియ.. వనపర్తిలో శవంగా..
![Sai Priya Missing Case : నాలుగు రోజుల ముందు అదృశ్యమైన సాయి ప్రియ.. వనపర్తిలో శవంగా.. Sai Priya Missing Case : నాలుగు రోజుల ముందు అదృశ్యమైన సాయి ప్రియ.. వనపర్తిలో శవంగా..](https://www.tv5news.in/h-upload/2022/09/10/791166-sai-priya-missing-case.webp)
Sai Priya Missing Case హైదరాబాద్లోని కాటేదాన్లో యువతి సాయిప్రియ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ప్రియుడే ఆమెను హత్య చేసి పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. మాట్లాడాదామని పిలిచి, పెళ్లికి అంగీకరించకపోవడంతో హత్య చేసినట్లు నిందితుడు శ్రీశైలం పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కాటేదాన్లోని టీఎన్జీవోస్ కాలనీలో కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉండే సాయిప్రియ... సెప్టెంబర్ 5న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. అయితే ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
అలా ఇంట్లో నుంచి వెళ్లిన ఆమె... వనపర్తిలో శవమై కనిపింది. సాయిప్రియ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఆమె ప్రియుడు శ్రీశైలంపై అనుమానంతో దర్యాప్తు చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా మానాజీపేటకు చెందిన శ్రీశైలానికి, సాయిప్రియకు 2017లో హైదరాబాద్లో డిగ్రీ చదువుకునే రోజుల్లో పరిచయం ఏర్పడినట్లు పోలీసుల విచారణంలో తేలింది. ఈ పరిచయం కాస్తా... ప్రేమగా మారిందని... అయితే ఇద్దరి పెళ్లికి సాయిప్రియ కుటుంబ సభ్యులు అంగీకరించలేదని పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రుల మాటకు కట్టుబడి శ్రీశైలంతో సాయిప్రియ మాట్లాడటం మానేసింది. అయితే మూడు నెలల క్రితం మళ్లీ ఇద్దరి మధ్య మాటలు కలిసినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలోనే ఈనెల 5న మాట్లాడాలని చెప్పి... మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్కు రప్పించి... అక్కడి నుంచి బైక్పై ఎక్కించుకుని మానాజీపేట శివారు మబ్బుగుట్టకు తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.
హత్యకు ముందు కూడా ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చిందని... అయితే ఆమె ఒప్పుకోలేదని పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీశైలం... సాయిప్రియ గొంతుకు చున్నీ బిగించి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని అతని బంధువు శివతో కలిసి, కెఎల్ కాలువ సమీపంలో గుంత తవ్వి పూడ్చి పెట్టాడు.
నిందితుడు శ్రీశైలం, అతనికి సహకరించిన శివను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని సంఘటనా స్థలానికి వెంటబెట్టుకొని వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. కుమార్తె ఇకలేదని తెలిసి సాయిప్రియ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com