Telangana Crimes : ఆ నేరాల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రమే టాప్..

Telangana Crimes : తెలంగాణలో పోలీస్ రిక్ర్యూట్మెంట్లు భారీగా జరిగినా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకున్నాం అని చెబుతున్నా.. నేరాలు మాత్రం తగ్గడం లేదు. మానవ అక్రమ రవాణాలో, ఆహార కల్తీ కేసులలో, సైబర్ నేరాల్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. ఆర్థిక నేరాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. వృద్ధులపై దాడుల్లో తెలంగాణకు మూడో స్థానం దక్కింది. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది తెలంగాణ. 2021 ఏడాదికి సంబంధించిన క్రైమ్ రిపోర్టును విడుదల చేసిన NCRB.. తెలంగాణలో నేరాల పరిస్థితిని వివరించింది.
సైబర్ నేరాలకు పాల్పడుతూ ఆర్థికంగా మోసం చేస్తున్న కేసులు తెలంగాణలోనే ఎక్కువగా నమోదయ్యాయి. ఏడాదిలో ఏకంగా 8వేల 690 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక వృద్ధులపై దాడుల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. వృద్ధుల ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడిన కేసుల్లో మాత్రం తెలంగాణదే దేశంలో అగ్రస్థానం. దళిత మహిళలపై అత్యాచారం కేసుల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. గిరిజన మహిళలపై జరిగిన అత్యాచారం కేసుల్లో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది.
ధరణి గురించి ఘనంగా చెప్పుకుంటున్నప్పటికీ.. భూములు, స్థలాల్ని నేరపూరితంగా ఆక్రమించడంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. ప్రభుత్వ ఆఫీసులలో అవినీతి కూడా తెలంగాణలో ఎక్కువగా జరుగుతోంది. అవినీతి నిరోధక చట్టం కింద కేసుల నమోదులో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులలో మహారాష్ట్ర తర్వాత స్థానం తెలంగాణదే. అయితే, అక్రమ రవాణా కేసుల్లో నిందితుల అరెస్టుల విషయంలో మాత్రం తెలంగాణ తొలిస్థానంలో ఉంది. కాని, మహిళలపై నేరాలకు సంబంధించి న్యాయస్థానాల్లో వీగిపోతున్న కేసులు తెలంగాణలోనే అధికంగా నమోదవుతున్నాయి. మహిళలను వేధించిన కేసుల్లో న్యాయస్థానాల్లో రాజీ పడుతున్న ఉదంతాలు కూడా తెలంగాణలోనే ఎక్కువగా ఉంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com