Uttarakhand : రిసెప్షనిస్ట్ హత్య కేసులో బీజేపీ నేత కుమారుడు.. పార్టీ నుంచి సస్పెండ్..

Uttarakhand : ఉత్తరాఖండ్లో సంచలనం సృష్టించిన రిసెప్షనిస్ట్ అంకిత భండారి హత్యకేసులో డెడ్బాడీని గుర్తించారు పోలీసులు. ఉదయం చిల్లా కెనాల్లో డెడ్బాడీని గుర్తించగా...ఆమె కుటుంబసభ్యులు మృతదేహం అంకితభండారిదేనని నిర్ధారించారు. తర్వాత రిషికేష్ ఎయిమ్స్కు తరలించారు.
బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పని చేసే అంకితా భండారి..ఈ నెల 19న డ్యూటీకి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆమె తండ్రి ఉదయ్పూర్ తల్లాలోని రాజస్వ చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...రిసార్ట్ ఓనర్ పులకిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొదట కేసును తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికి..పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నిజం ఒప్పేసుకున్నారు. ముగ్గురు నిందితులను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోసం పౌరి జిల్లా జైలుకు తరలించారు.
అంకితా భండారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..మద్యం తాగించినట్లు నిందితులు చెప్పారు. తర్వాత ఆమెను హత్య చేసి చిల్లా కెనాల్లో పడేసినట్లు నేరం ఒప్పుకున్నారు. అంకితతో విబేధాలు రావడం వల్లే హత్య చేసినట్లు అంగీకరించారు. రిసార్ట్ యజమానితో పాటు కొందరు ఆమెను వ్యభిచారంలోకి దించేందుకు యత్నించారని..అందుకు ఆమె అంగీకరించకపోవడంతోనే హత్య చేసినట్లు విచారణలో తేలింది.
ఇక ఈ ఘటనపై ఉత్తరాఖండ్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అంకిత హత్యకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండడంతో బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. పులకిత్ ఆర్యకు చెందిన వనతార రిసార్టును అధికారులు కూల్చేశారు. అంకితా భండారి హత్యపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్షపడేలా సిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాన నిందితుడు పులకిత్ ఆర్య తండ్రి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఆయన రెండో కొడుకు అంకిత్ ఆర్య రాష్ట్రమంత్రి హోదాలో ఉన్నారు.ఈ ఘటనతో వినోద్ ఆర్యతో పాటు అంకిత్ ఆర్యలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com