వెంకటగిరి వైసీపీకి కొత్త సారథి

వెంకటగిరి వైసీపీకి కొత్త సారథి
నెల్లూరులో పెద్దారెడ్లు తిరుగుబాటు చేయడంతో వైసీపీకి గడ్డుకాలం దాపురించిందా? ఎన్నికల బరిలో నిలిచేందుకు వైసీపికి అభ్యర్థులే కరువయ్యారా? టీడీపీలోని బలమైన అభ్యర్థులకు గాలం వేస్తోందా? ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపి డోర్లు బార్లా తెరిచిందా ? ఆనం రాజకీయ చతురత ముందు మేకపాటి వ్యూహాలు ఫలిస్తాయా



ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో ఎదురుదెబ్బ తగిలినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నెల్లూరులో పటిష్టంగా ఉందనుకున్న వైసీపీ రోజు రోజుకి వర్గపోరుతో బలహీనంగా మారుతున్నట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయల్లో ప్రత్యేకత సంతరించుకున్న నెల్లూరులో కొత్తతరం రాజకీయ నాయకులు నోటికి పనిచెబుతుండటంతో జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ విమర్శలను వ్యక్తిగతంగా తీసుకుని పరుషపదజాలంతో విరుచుకు పడుతూ జిల్లా పరువు తీస్తున్నారంటూ దశాబ్దాలుగా రాజకియాలు చేస్తున్న పెద్ద రాజకియ కుటుంబాలు బాహటంగానె విమర్శిస్తున్నాయి. రాజకీయ విమర్శలలో వాస్తవాలను వెతుక్కొని సరిదిద్దుకొనె రోజులు నాటి తరం పెద్దారెడ్లతోనే పోయాయంటున్నారు. దీనికి తోడు జిల్లాలో వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు కరువయ్యారట. దీంతో టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలకు వైసీపీ గాలం వేస్తోందట. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో వైసీపికి గడ్డు కాలం దాపురించిందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబాలు ఒక్కొక్కటిగా దూరం అవుతుండటంతో కొత్త అభ్యర్థుల కోసం వైసీపీ డోర్లు బార్లా తెరిచి రెడ్ కార్పెట్ పరిచిందని చర్చ జరుగుతోంది. అయితే నేతలెవ్వరూ పార్టీలో చేరేందుకు ముందుకు రాకపోవడంతో వైసీపీ ఖంగుతిన్నట్లు వినికిడి. అధికారంలో ఉన్నాం కాబట్టి మేం పిలిస్తే ఎవరైనా పరుగెత్తుకు వచ్చేస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్న వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బెడిసికొట్టినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైసీపీ ఆఫర్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో చేసేదేమీలేక అవుట్ డేటెడ్ నేతలను రంగంలోకి దించేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో పలానా నియోజకవర్గం టికెట్ మీకే ఇస్తామని కాళ్లా వేళ్లా పడ్డా వైసీపీలోకి వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్లు తెలుస్తోంది.


ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గంలొ సీనియర్ నేత మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని చేజార్చుకున్న వైసీపీ అక్కడ ఏర్పడిన లోటును ఇప్పటికీ పూడ్చుకోలేక కిందా మీదా పడుతోందని నియోజకవర్గంలో టాక్ వినపిస్తోంది. ఎప్పుడో రాజకీయాలకు దూరమైన నేదురుమల్లి కుటుంబం నుండి వెంకటగిరి నియోజకవర్గ ఇంఛార్జిగా రాంకుమార్ రెడ్డిని వైసీపీ తీసుకొచ్చింది. అయితే రాంకుమార్ రెడ్డి నియోజకవర్గంలో నిలదొక్కుకోలేకపోవడంతో ఇప్పుడు మరో కొత్త ముఖాన్ని వెంకటగిరికి పరిచయం చేయాలని వైసీపీ అధిష్ఠానం భావిస్తోందట. దీనికి వెనుక మేకపాటి రాజమోహన్ రెడ్డి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి వెంకటగిరి టికెట్ ఆశ చూపి వైసీపీలోకి తీసుకువస్తే .. ఆత్మకూరులో తన రాజకీయ వారసుడికి మేలు కలుగుతుందన్న ఆలోచనతో పెద్దాయన స్కెచ్ వేసినట్లు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన బొమ్మిరెడ్డి.. తరువాత కాలంలో వైసీపి కండువా కప్పుకున్నారు. అప్పట్లోనే వెంకటగిరి సీటు ఆశించిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో సైకిల్ ఎక్కారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి లేకపోవడంతో కొరవడిన నాయకత్వ సమస్యను నేదురుమల్లి రాంకుమార్ రెడ్డితో చక్కపెట్టవచ్చనుకొని బొక్కబోర్లా పడిన వైసీపికి నీళ్లల్లో మునిగిపోతున్న వాడికి గడ్డిపోచ దొరికినట్టు బొమ్మిరెడ్డి దొరకడంతో వైసీపీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయాట.


బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రాకతో స్వామి కార్యం స్వకార్యం నెరవేర్చుకోవచ్చని గతంలో వెంకటగిరి సీటు ఆశించిన బొమ్మిరెడ్డిని మరోసారి అదే టికెట్ ఆశ చూపించి రంగంలోకి దించేందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. బొమ్మిరెడ్డి కుటుంబం స్వస్థలం ఆత్మకూరు కావడంతో రాజకీయాల్లో ఓనమాలు దిద్దుతున్న తన రాజకీయ వారసుడు మేకపాటి విక్రమ్ రెడ్డికి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సహకారం లభిస్తుందన్న ఆలోచనలో ఉన్నారట పెద్దాయన. దీంతో వెంకటగిరికి సీటు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వయా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిగా మారిందట. ఆనం లేని లోటు.. నేదురుమల్లి నాయకత్వంలో చుక్కానిలేని నావలా తయారైన వెంకటగిరి వైసీపిని బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గట్టెక్కించగలడా లేదా అన్నాది కాలమే నిర్ణయించాలి.

Tags

Read MoreRead Less
Next Story