కొత్త ఇంచార్జ్తో రేవంత్, భట్టి భేటీ

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రేతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమితులైన తర్వాత ఠాక్రే తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో నేతలు స్వాగతం పలికారు. వచ్చిరాగానే కాంగ్రెస్ నేతలతో గాంధీభవన్లో ఠాక్రే సమావేశం నిర్వహించారు. పార్టీలో నెలకొన్న వివాదాలపై రేవంత్, భట్టి విక్రమార్కతో ఆయన చర్చించారు. అలాగే మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, గీతారెడ్డిలతోపాటు పలువురు సినీయర్ నేతలతో ఠాక్రే వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఠాక్రే ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే తాను గాంధీ భవన్కు రాలేనని... బయట కలుద్దామని కోమటి రెడ్డి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఇవాళ రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యులతో ఠాక్రే సమావేశం కానున్నారు. రేపు డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, అధికార ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com