కలకలం రేపుతున్న ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కలకలం రేపుతున్న ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్యహత్య కలకలం రేపుతుంది. కుల్సుంపుర పరిధిలోని భరత్ నగర్ లో నివాసం ఉంటున్న నవ్య అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే నవ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చదువుతో పాటు అన్ని విషయాల్లో యాక్టివ్‌గా ఉండే నవ్య ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీమ్‌ ఆధారంగా అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు నవ్య ఇంటి ముందు పసుపు, నిమ్మకాయలను పోలీసులు గుర్తించారు.

మరోవైపు తమ కూతురుని క్షుద్రపూజలు చేసి చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు గత నాలుగు రోజులుగా క్షుద్రపూజలు చేసి నిమ్మకాయలు, దీపాలు పెట్టి వెళుతున్నారని తెలిపారు. క్షుద్రపూజల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. నవ్య మెరిట్‌ స్టూడెంట్‌గా తెలుస్తోంది. పదో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

గత కొన్ని రోజులుగా నవ్య విచిత్రంగా ప్రవర్తిస్తోందని ఆమె సోదరి వెల్లడించారు. క్షుద్రపూల వల్లే నవ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. క్షుద్రపూజల వ్యవహారంపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో పాటు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. నవ్య ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీసున్నారు. ఆత్మహత్య చేసుకుందా లేక మరే కారణాలైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.

Tags

Next Story