Bihar: రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడుతున్న ముగ్గురు యువకులు.. రైలు వారిపైకి దూసుకెళ్లడంతో..

చేతిలో మొబైల్, చెవిలో ఇయర్ ఫోన్స్.. ఇంకేం తెలుస్తుంది చుట్టు పక్కల ఏం జరుగుతుందో, తమ వెనుక ఏం వస్తుందో.. ఫోన్లో నిమగ్నమై పబ్జీ గేమ్ ఆడుతున్నారు.. విధి కూడా వారితో ఆటలాడుకుని వారి ప్రాణాలు తీసింది. ముగ్గురు యువకుల జీవితాలు రైల్వే చక్రాల క్రింద నుజ్జు నుజ్జు అయ్యాయి.
ఈ దురదృష్టకర సంఘటన బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతులు మన్షా తోలా; సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించారు పోలీసులు. ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మంది స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులు మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామాలకు తరలించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న సదర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) వివేక్ దీప్ మరియు రైల్వే పోలీసులు ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. గేమింగ్ కారణంగా టీనేజర్ల పరధ్యానంతో పాటు ప్రమాద స్థలంలో ఉన్న పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారు.
రైల్వే ట్రాక్లపై సెల్ఫీలు దిగడం, షార్ట్స్ చేయడం, మొబైల్ గేమ్లు ఆడటం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఎంత చెప్పినా వినిపించుకోని యువత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
పిల్లల గేమింగ్ అలవాట్లను పర్యవేక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలను నివారించడానికి బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండటం యొక్క ప్రాముఖ్యత గురించి వారికి అవగాహన కల్పించాలని అధికారులు తల్లిదండ్రులను కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com