ఆస్తి కోసం పిల్లల వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు

కడుపున పుట్టిన వాళ్లు కూడా కన్నవాళ్లను కాదంటున్నారు. బయట నుంచి వచ్చిన భార్య మాట విని అమ్మానాన్నలను అష్టకష్టాలు పెడుతున్నారు. రేపొద్దున్న తమ పరిస్థితి ఎలా ఉంటుందో, తాము కన్న బిడ్డలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తే ఏమిటి అని ఇసుమంతైనా ఆలోచన చేయడం లేదు.
రాజస్థాన్లో 70 ఏళ్ల వృద్ధుడు, అతని భార్య తమ ఇంటి వాటర్ ట్యాంక్లోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి స్వంత పిల్లలు తమపై చేసిన అఘాయిత్యాలను పేపర్ మీద రాసి గోడపై అతికించారు.
ఆ దంపతుల కుమారులు, కోడళ్లు తమను కొట్టడమే కాకుండా చంపేస్తామని బెదిరించారని, భోజనం పెట్టడం మానేశారని, తమ తల్లిని ‘ఒక గిన్నె తీసుకుని అడుక్కోవాలని’ ఆ లేఖలో పేర్కొన్నారు.
హజారీరామ్ బిష్ణోయ్ (70), అతని 68 ఏళ్ల భార్య చావలీ దేవి రాజస్థాన్లోని నాగౌర్లో నివసించేవారు. వారి మృతదేహాలను గురువారం కర్ని కాలనీలోని వారి ఇంటిలోని వాటర్ ట్యాంక్ నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం - ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
తమ కొడుకులు, కూతుళ్లు మాట్లాడవద్దని, ఫిర్యాదు చేయవద్దని, లేకుంటే నిద్రలోనే చంపేస్తామని హెచ్చరించారని నోట్ లో రాసారు. తమ పేరు మీద ఉన్న ఆస్తి అంతా తమ పిల్లలకు కావాలని కొడుకులు, కూతుళ్లు తమతో తరచూ గొడవ పడుతుండేవారని నోట్ లో రాసుకొచ్చారు.
దంపతులను మోసం చేసి వారితో గొడవ పడి ఇప్పటికే మూడు ప్లాట్లు, కారును బదిలీ చేయించుకున్నారని నోట్లో పేర్కొన్నారు.
ఆహారం కూడా ఇవ్వలేదు
బలవంతంగా ఆస్తి రాయించుకున్న పిల్లలు తమకు ఆహారం ఇవ్వడానికి నిరాకరించారని, ప్రతిరోజూ ఫోన్లో దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. తమ కొడుకు సునీల్ తమను పిలిచి.. గిన్నె తీసుకోండి.. ఆహారం కోసం అడుక్కోండి, నేను మీకు ఆహారం ఇవ్వను.. ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పాడని ఆ నోట్లో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com