Karnataka: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వ్యక్తి సాహసోపేత నిర్ణయం.. చిరుత తోక పట్టుకుని..

పులి పేరు చెబితేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. దానికి చిక్కామంటే ఇంక ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.. ఈ మధ్య అరణ్యాలు వదిలి జనావాసాల్లో సంచరిస్తున్న పులులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
ఒక వ్యక్తి చిరుతపులి తోకను పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగే వరకు ఆ వ్యక్తి చిరుతపులిని తోకను గట్టిగా పట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
రెండు రోజులుగా గ్రామంలో చిరుతపులి స్వైరవిహారం చేయడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దానిని పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టుకోలేకపోయారు. గ్రామస్తులు వేసిన ఉచ్చును కూడా చిరుత తప్పించుకుంది. అదే గ్రామంలో నివసిస్తున్న ఆనంద్ అనే వ్యక్తి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. చిరుత తోకను గట్టిగా పట్టుకున్నాడు.
అటవీ అధికారులు, గ్రామస్థుల బృందం చేయలేని పని అతడు చేశాడు. ఆనంద్ వేగంగా చిరుతపులి వెనుక అడుగులు వేసి దాని తోకను ఒడిసి పట్టుకున్నాడు. వెంటనే పోలీసులు చిరుతపులిని వలలో కప్పి బంధించారు. అనంతరం చిరుతను సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. గతేడాది నవంబర్లో చిరుతపులి 52 ఏళ్ల మహిళను పట్టి చంపింది. ఆ విషయం గుర్తుకు తెచ్చుకుని గ్రామస్తులు పులిని బంధించినందుకు ఆనంద్ ని అభినందిస్తూ ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com