పని ఒత్తిడితో ఆత్మహత్య.. బజాజ్ ఉద్యోగి సూసైడ్ నోట్..

ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో బజాజ్ ఫైనాన్స్లో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్న 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తరుణ్ సక్సేనా గత రెండు నెలలుగా తన లక్ష్యాలను చేరుకోవాలని తన సీనియర్లు తనపై ఒత్తిడి తెస్తున్నారని, జీతం తగ్గింపులతో బెదిరిస్తున్నారని ఒక నోట్లో పేర్కొన్నాడు.
ఈ ఉదయం ఇంటిలో తరుణ్ శవమై కనిపించాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను మరో గదిలో బంధించి అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడికి తల్లిదండ్రులు, భార్య మేఘా, పిల్లలు యథార్థ్ మరియు పిహు ఉన్నారు.
తన భార్యను ఉద్దేశించి ఐదు పేజీల లేఖలో, తరుణ్ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ లక్ష్యాలను చేరుకోలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని రాశాడు. తరుణ్కు అతని ప్రాంతం నుండి బజాజ్ ఫైనాన్స్ లోన్ల EMIల సేకరణ బాధ్యత ఉంది, కానీ అనేక సమస్యల కారణంగా లక్ష్యాలను చేరుకోలేకపోయాడు. తన ఉద్యోగం పోతుందేమోనని ఆందోళన చెందుతున్నానని కూడా చెప్పాడు. తన సీనియర్లు తనను పదే పదే అవమానించారని రాశారు. "నేను భవిష్యత్తు గురించి చాలా టెన్షన్గా ఉన్నాను. నేను ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోయాను. నేను వెళ్తున్నాను" అని తరుణ్ లేఖలో పేర్కొన్నారు.
తరుణ్ తన పిల్లల స్కూల్ ఫీజులను సంవత్సరం చివరి వరకు చెల్లించానని, కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నానని కూడా రాశాడు. "మీరంతా మేఘా, యథార్థ్, పీహులను జాగ్రత్తగా చూసుకోండి. అమ్మానాన్ని మిమ్మల్ని నేనెప్పుడూ ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. నా భార్యా పిల్లలు ఉండేందుకు దయచేసి రెండో అంతస్తును నిర్మించి ఇవ్వండి" అని తరుణ్ తన తల్లిదండ్రులను లేఖలో కోరాడు.
తన పిల్లలను బాగా చదివించాలని, తల్లిని బాగా చూసుకోవాలని కోరారు. తన కుటుంబానికి బీమా సొమ్ము అందేలా చూడాలని బంధువులను కోరారు. అతను తన సీనియర్ల పేర్లను కూడా పేర్కొన్నాడు, వారిపై పోలీసు ఫిర్యాదును నమోదు చేయమని అతని కుటుంబాన్ని కోరాడు. "నా ఆత్మహత్య నిర్ణయానికి వారే బాధ్యులు" అని లేఖలో పేర్కొన్నారు.
"టార్గెట్స్పై తన సీనియర్లు తనపై ఒత్తిడి తెస్తున్నారని సూసైడ్ నోట్లో ఉంది. కుటుంబం నుండి మాకు ఫిర్యాదు వస్తే, మేము చర్య తీసుకుంటాము అని పోలీసులు తెలిపారు.
26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం తర్వాత పని సంస్కృతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తరుణ్ సక్సేనా ఆత్మహత్యతో మరణించడం, అతని సీనియర్ మేనేజర్లను నిందిస్తూ ఆయన లేఖలో పేర్కొనడం మరోసారి చర్చకు దారి తీసింది.
అన్నా తల్లి అనితా అగస్టిన్ రాసిన లేఖ సోషల్ మీడియాలో పెద్ద ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఎర్నెస్ట్ & యంగ్ ఇండియా ఛైర్మన్ రాజీవ్ మెమనికి రాసిన లేఖలో, ఆమె తన కుమార్తె కంపెనీలో చేరిన నాలుగు నెలలకే చనిపోయిందని, అన్నా వారాంతాల్లో కూడా "ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా" అర్థరాత్రి వరకు పని చేసేదని ఆమె రాసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com