UP: పొగమంచు ప్రమాదం.. నవదంపతులు సహా ఏడుగురు దుర్మరణం
పెళ్లి తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. నవదంపతులు సహా వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదానికి పొగమంచు కారణమని స్థానికులు భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో పెళ్లి తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన దంపతులతో సహా మరో ఐదుగురు మరణించారు. శనివారం తెల్లవారుజామున పొగమంచు కమ్ముకున్న సమయంలో జాతీయ రహదారి-74పై మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా వారి ఆటోను కారు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు.
నిన్న సాయంత్రం జార్ఖండ్లో వధూవరుల వివాహం జరిగింది. బిజ్నోర్లోని ధాంపూర్లోని స్వగ్రామానికి తిరిగి వచ్చేందుకు మొరాదాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఆటో మాట్లాడుకుని వస్తున్నారు.
దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని బిజ్నోర్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ తెలిపారు. వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు లేన్లు మారుస్తుండగా ఆటోను కారు ఢీ కొట్టిందని తెలిపారు.
వధువు, వరుడితో సహా వరుడి కుటుంబ సభ్యులు నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఉన్నతాధికారి తెలిపారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఘటనలో గాయపడిన కారు డ్రైవర్పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com