Salt: ఉప్పు ఆరోగ్యానికి ముప్పు.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

Salt: ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది. కూరలో కారం తక్కువైనా పర్లేదేమో కానీ ఉప్పు మాత్రం సరిపడా ఉంటేనే నోటికి రుచిగా ఉంటుంది. అదే కొంచెం ఎక్కువైతే కూడా తినడం కష్టమే. సాల్ట్ లేని డైనింగ్ టేబుల్ను మనం ఊహించలేము. మనం చేసే ప్రతి వంటలోనూ ఉప్పు తప్పనిసరి.
అయితే ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ముప్పు తప్పదనే విషయం తెలిసినా అశ్రద్ధ. అసలు డైనింగ్ టేబుల్ మీద ఉండే ఉప్పు డబ్బాను అర్జెంటుగా తీసేయాలని.. ద అమెరికన్ కాలేజ్ ఆప్ కార్డియాలజీ సైంటిస్ట్లు వార్నింగ్ ఇస్తున్నారు.. W.H.O నిబంధనల ప్రకారం అధిక ఉప్పు గుండె జబ్బులు, స్ట్రోక్లకు దారి తీస్తుంది.ఉప్పు వినియోగాన్ని తగ్గించడంతో ప్రతి సంవత్సరం సుమారు 25 లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చని డాక్టర్లు అంటున్నారు.
ఇక ఉప్పు తక్కువగా తీసుకునే వారికి హార్ట్ ఎటాక్, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. యూకేలో బయోబ్యాంక్కు చెందిన లక్షా 77 వేల మంది పేషెంట్ల ఆహారపు అలవాట్లను, ఆరోగ్య సమస్యలను దాదాపు 12 సంవత్సరాలపాటు పరిశీలించారు. అదనంగా ఉప్పు వేసుకున్న 7 వేల మందికి గుండెపోటు రాగా, రెండు వేల మంది పక్షవాతం బారిన పడ్డారు.
అయితే భోజనం చేసేటప్పుడు అదనంగా ఉప్పు వేసుకోనివారిలో హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉన్నట్టు స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ తెలిపారు. ఇలా విడిగా ఉప్పు వేసుకోవడం మానేసిన వారికి బీపీ, కార్డీయాక్ సమస్యల ముప్పు తగ్గినట్టు తెలిపారు.
WHO మార్గదర్శకాల ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే గుండె జబ్బులు, గుండెపోటు, కిడ్నీ సమస్యలు రావడం ఖాయం. ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం కారణంగా ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉప్పు ఎక్కువగా వస్తోందని అంటున్నారు. ఉప్పు ఎక్కువగా తినే వారు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. లేదంటే ఆరోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com